Good News: పరీక్ష కేంద్రం మార్చుకోవచ్చు
ABN , First Publish Date - 2021-10-21T13:38:36+05:30 IST
విద్యార్థులకు పరీక్ష కేంద్రం మార్చుకొనే..
10, 12 తరగతుల టర్మ్ ఎగ్జామ్స్కు అవకాశం
న్యూఢిల్లీ: మొదటి టర్మ్ ఎగ్జామ్స్ రాయనున్న 10, 12 తరగతుల విద్యార్థులకు పరీక్ష కేంద్రం మార్చుకొనే అవకాశం కల్పించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం కోసం స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా నేపథ్యంలో చాలామంది విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరిలో కొంతమంది తిరిగి స్కూళ్లు ఉన్న చోటుకి చేరుకోవాల్సి ఉంది. ఇలాంటి విద్యార్థులు తాము ఉండేచోటుకి దగ్గరలో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని సీబీఎస్ఈని కోరారు. ఈ విషయంపై సీబీఎస్ఈ స్పందించింది. సరైన సమయంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రం మార్చుకొనే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. విద్యార్థులు ముందుగా స్కూళ్లకు ఈ విషయాన్ని తెలియజేయాలి.
ఆయా స్కూళ్లు ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను బోర్డుకు చేరవేస్తాయి. దీనికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉందని సీబీఎస్ఈ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు వెబ్సైట్ను విద్యార్థులు, స్కూళ్లు గమనిస్తుండాలని సీబీఎస్ఈ సూచించింది. ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబరు - డిసెంబరులో జరగనున్నాయి.