తోలుకో.. నా రాజా..!..
ABN , First Publish Date - 2022-04-29T06:06:47+05:30 IST
కడప నగరంలోని వైఎ్సఆర్ లేఔట్ పైన గుట్టపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గనుల శాఖ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ వ్యవహాం చర్చనీయాంశంగా మారింది.
గ్రావెల్ తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
లీజ్ ఒకచోట.. తవ్వేది మరోచోట
రాయల్టీ చెల్లించడంలోనూ గోల్మాలే
పక్కా నెట్వర్క్తో అధికారులకు బురిడీ
ఇది కడపలో గ్రావెల్ దందా
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. లీజ్ ఒక చోట ఉంటే మరో చోట తవ్వుకొని ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా బురిడీ కొట్టిస్తున్నారు. గ్రావెల్కు డిమాండ్ ఉండడంతో ఇష్టారాజ్యంగా కొందరు తవ్వుతున్న తీరు గనుల శాఖ అధికారులనే నివ్వెరపరుస్తోంది.
కడప, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలోని వైఎ్సఆర్ లేఔట్ పైన గుట్టపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గనుల శాఖ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ వ్యవహాం చర్చనీయాంశంగా మారింది. కడప నగరంలోని చిన్నచౌక్ రెవెన్యూ స్థలంలో గ్రావెల్ గుర్తించారు. సర్వే నెంబర్ 919లో వైఎ్సఆర్ లేఔట్ వద్ద గుట్ట పైన 5 మందికి గ్రావె ల్ తవ్వకాలకు అనుమతించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి వారికి కేటాయించిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుకోవాలి.
ఎవరెవరికి కేటాయించారంటే
గౌతమి యువతి మండలికి మూడు ఎకరాలు కేటాయించారు. 13 మార్చి 2018 నుంచి 18 డిసెంబర్ 2023 వరకు గడువు ఇచ్చారు. జి.చెన్నారెడ్డికి 4 ఎకరాలు కేటాయించారు. 10 జూన్ 2020 నుంచి 9 జూన్ 2025 వరకు లీజ్ గడువు. శ్రీమతి రాధికకు 11 ఎకరాలు కేటాయించారు. 3 మే 2020 నుంచి 3 ఏప్రిల్ 2030 వరకు లీజ్ గడువు. ఓ.బాలకొండయ్యకు 10 ఎకరాలు కేటాయించారు. 14 ఆగస్టు 2020 నుంచి 13 ఆగస్టు 2030 వరకు లీజ్ గడువు. సాయి ఏజెన్సీకి 11 ఎకరాలు కేటాయించగా 24 ఫివ్రబరి 2022 నుంచి 25 ఫిబ్రవరి 2032 వరకు లీజ్ గడువు ఇచ్చారు.
ముఖ్య నేతల గుప్పెట్లో లీజ్లు
గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఒకరి పేరిట ఉంటే వీటిని కడపకు చెందిన ఓ నేత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు సమాచారం. కడప నగరం చుట్టూ లేఔట్లు విస్తరిస్తున్నాయి. లేఔట్ల లెవలింగ్, రహదారులు ఇతర వాటికి గ్రావెల్ వాడతారు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. కొన్ని గ్రావెల్ లీజులను ఆ నేత కుటుంబ సభ్యులు గుప్పెట్లో పెట్టుకొని తవ్వకాలు జరుపుకొని సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత
కేటాయించిన లీజ్ ప్రాంతంలోనే గ్రావెల్ తవ్వుకోవాల్సి ఉంది. అన్ని పన్నులు కలుపుకొని క్యూబిక్ మీటర్కు రూ.115 ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే అధికారం మాటున కొందరు ఇష్టారాజ్యంగా తవ్వుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేటాయించిన లీజ్లో కాకుండా మరో చోట తవ్వకాలు, తవ్వినదానికి రాయల్టీ కట్టకుండా తక్కువ తవ్వినట్లు రాయల్టీ చెల్లించి ప్రభుత్వ ఖజానాకు సున్నం కొడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇక మైనింగ్ అధికారుల కదలికలు తెలుసుకునేందుకు మైనింగ్ కార్యాలయంలో కొందరు కొరియర్లను ఏర్పాటు చే సుకున్నారని సమాచారం. అధికారులు దాడులకు వచ్చే సమయాన్ని వారి ద్వారా తెలుసుకుని ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇక పగటి పూట కాకుండా రాత్రి పూట కూడా తవ్వకాలు జరిపారని చెబుతారు.
అక్రమాల గుట్టు ఇలా
గ్రావెల్ తవ్వకాల లీజును అధికారులు పరిశీలించగా భారీ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. లీజ్ ఒక చోట అయితే మరో చోట తవ్వడం, తవ్వినంత దానికి డబ్బు కట్టకుండా తక్కువగా చెల్లించినట్లు గుర్తించారు. ఇందుకుగాను ఒక్కో మైనింగ్కు ఫైన్ వేశారు. రాధికా మైన్కు రూ.5.55 కోట్లు, బాలకొండయ్యకు రూ.3.52 కోట్లు, చెన్నారెడ్డి రూ.2.40 కోట్లు, గౌతమికి రూ.3.35 కోట్లు పెనాల్టీ విధించారు. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు ఆగలేదని సమాచారం.
అక్రమ తవ్వకాలు సహించేది లేదు
- డి.రవిప్రసాద్, ఏడీ, మైనింగ్ కడప
కడప పరిధిలో అక్రమ మైనింగ్లు సహించేది లేదు. నిబంధనల ప్రకారం రాయల్టీ చెల్లించి గ్రావెల్ తవ్వకోవాలి. నిబంధనలకు విరుద ్ధంగా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని మైనింగ్లపై పెనాల్టీ వేశాం.