శ్యామలా..భళా
ABN , First Publish Date - 2021-03-20T09:32:47+05:30 IST
ఎటు చూసినా నీలి సంద్రం..హోరు గాలి.. ఉవ్వెత్తున ఎగిసే అలలు.. ఒడ్డున ఉండి చూస్తేనే ఒళ్లు జలదరింపు....
వరల్డ్ మాస్టర్స్లో ప్రాతినిధ్యం
పాక్ జలసంధిని ఈదిన తొలి తెలంగాణ మహిళ
ప్రపంచంలో రెండో అతివగా రికార్డు
ఎటు చూసినా నీలి సంద్రం.. హోరు గాలి.. ఉవ్వెత్తున ఎగిసే అలలు..ఒడ్డున ఉండి చూస్తేనే ఒళ్లు జలదరింపు..అలాంటి ఆ సముద్రాన్ని ఈది భళా అనిపించింది హైదరాబాద్కు చెందిన 47 ఏళ్ల గోలి శ్యామల. తమిళనాడు-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాను కలిపే పాక్ జలసంధిని 30 కి.మీ., మేర ఈది ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ మహిళగా, ప్రపంచంలో రెండో అతివగా శ్యామల రికార్డుపుటల్లో చోటు సంపాదించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): ఎటు చూసినా నీలి సంద్రం..హోరు గాలి.. ఉవ్వెత్తున ఎగిసే అలలు.. ఒడ్డున ఉండి చూస్తేనే ఒళ్లు జలదరింపు.. అలాంటి ఆ సముద్రాన్ని ఈది భళా అనిపించింది హైదరాబాద్కు చెందిన 47 ఏళ్ల గోలి శ్యామల. తమిళనాడు-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాను కలిపే పాక్ జలసంధిని 30 కి.మీ., మేర ఈది ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో మహిళ (తొలి మహిళ బులా చౌదరి)గా శ్యామల రికార్డుపుటల్లో చోటు సంపాదించింది. శుక్రవారం ఉదయం 4.15కి శ్రీలంక తీరంలో తన సాహసాన్ని ప్రారంభించిన శ్యామల 13 గంటల 43 నిమిషాలపాటు ఏకబిగిన ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకుంది.
యానిమేషన్ చిత్రాల నిర్మాత అయిన శ్యామల డైరెక్టర్గా, రచయితగా విభిన్న పాత్రల్లో రాణిస్తోంది. నాలుగేళ్ల కిందటే స్విమ్మింగ్లోకి ప్రవేశించిన ఆమె.. దక్షిణకొరియాలోని గ్వాన్జులో గతేడాది జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్షి్పలో భారత్కు ప్రాతినిధ్యం వహించిం ది. నిరుడు నవంబరులో గంగా నదిలో 30 కి.మీ., దూరాన్ని కేవలం 110 నిమిషాల్లో ఈది ఆరో స్థానంలో నిలిచింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో శ్యామల.. పాక్ జలసంధిని ఈదడంలో శిక్షణ పొందింది. త్రివేది కూడా 2012లో పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదారు. గచ్చిబౌలిలోని శాట్స్ స్విమ్మింగ్ పూల్లో ఆయుష్ యాదవ్ ఆమె కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
మహిళల విజయం
తాను పాక్ జలసంధిని ఈదడం మహిళల విజయంగా శ్యామల అభివర్ణించింది. ఈ ఘనత మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచి..వారు అత్యున్నత లక్ష్యాలు నిర్దేశించుకొనేలా ప్రేరేపిస్తుందన్న ఆశాభావం ప్రకటించింది. అంతేకాదు తాము సాధించలేనిది ఏదీ లేదనే నమ్మకాన్నీ వారిలో కలిగిస్తుందని శ్యామల పేర్కొంది.