బంగారం, వెండి ధరలు డౌన్.. 4 రోజుల్లో పసిడి ఎంత తగ్గిందంటే..
ABN , First Publish Date - 2020-08-14T12:43:31+05:30 IST
దూసుకెళ్లిన పసిడి దిగొస్తుంది. వారం రోజులుగా ఆల్టైం రికార్డులను..
పసిడి.. పడింది!
కేజీకి రూ.8,700 తగ్గిన వెండి ధర
నరసాపురం(పశ్చిమ గోదావరి): దూసుకెళ్లిన పసిడి దిగొస్తుంది. వారం రోజులుగా ఆల్టైం రికార్డులను నమోదు చేసుకున్న పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రకటించినప్పటి నుంచి బంగారం పడిపోతూ వచ్చింది. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం ధర (బిస్కెట్) పది గ్రాములకు సుమారు రూ. 4 వేలు తగ్గింది. గురువారం మార్కెట్లో పది గ్రాముల బిస్కెట్ బంగారం రూ. 54,200 పలికింది. వెండి కూడా ఇదే బాటలో పతనమైంది. సోమవారం కేజీ వెండి రూ.76,700 ఉండగా మంగళ, బుధవారాల్లో పతనమవుతూ వచ్చింది. గురువారం మార్కెట్లో కేజీ వెండి రూ. 68 వేలు పలికింది. కేజీకి రూ. 8,700 తగ్గింది. లాక్డౌన్ నుంచి అంటే మార్చి నెలాఖరు నుంచి బంగారం ధర పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి చివరిలో పది గ్రాముల బిస్కెట్ బంగారం రూ.38 వేలు పలికింది. అక్కడ నుంచి పెరుగుతూ వచ్చి సోమవారం నాటికి రూ. 57,800కి చేరింది. మంగళవారం రూ.500 తగ్గి రూ.57,200 పలికింది. అయితే అదే రోజు అంతర్జతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పతనమైంది. బుధవారం కూడా ఇదే కొనసాగింది. రూ.55 వేల నుంచి రూ.53 వేలకు దిగింది. కానీ ఎక్కువ సేపు నిలబడలేదు. క్రమంగా పెరుగుతూ గురువారం ఉదయం రూ.54,200కు చేరింది. సాయంత్రం వరకు ఇదే ధర కొనసాగింది. వెండి సోమవారం రూ.76,700 ఉండగా మంగళవారం రూ.67 వేలకు దిగింది. తరువాత కొద్దిగా పెరిగి రూ. 68 వేలు వద్ద కొనసాగుతోంది. ధరలు పతనమవుతున్నా వినియోగదారులు మాత్రం తొందరపడడం లేదు. మరింత తగ్గితే కొనవచ్చని చూస్తున్నారు.