బంగారం @ రూ.51,000
ABN , First Publish Date - 2020-07-10T05:58:39+05:30 IST
బంగారం ధర సరికొత్త జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరిగి రూ.51,460కి ఎగబాకింది...
- రూ.52 వేలకు చేరువలో వెండి
న్యూఢిల్లీ: బంగారం ధర సరికొత్త జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరిగి రూ.51,460కి ఎగబాకింది. పసిడితోపాటు వెండి కూడా పుంజుకుంది. కిలో వెండి రేటు ఏకంగా రూ.1,880 పెరిగి రూ.51,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,184, కిలో వెండి రూ.52,930 పలికింది. ఇక ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.49,239, కిలో వెండి రూ.51,220గా నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ పోతుండటంతో ఆర్థిక ప్రగతిపై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధర ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,800 డాలర్లు, వెండి 18 డాలర్ల ఎగువ స్థాయిలో ట్రేడవుతున్నాయి.