HYD : పుట్టిన రోజు Gold Chain కోసం గొడవ.. చిన్నారిని చంపి.. తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-18T14:14:33+05:30 IST
పుట్టినరోజున పెడతానన్న గొలుసు విషయమై జరిగిన గొడవ చివరకు...
హైదరాబాద్ సిటీ/నాచారం : పుట్టినరోజున పెడతానన్న గొలుసు విషయమై జరిగిన గొడవ చివరకు చిన్నారి ప్రాణాలను తీసింది. తల్లి ఆత్మహత్యకు కారణమైంది. ఈ విషాద ఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నాచారంలోని కౌండిన్యనగర్ కాలనీలో నివసించే దీపిక (26), చంద్రశేఖర్లకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. చంద్రశేఖర్ ప్రైవేట్ ఉద్యోగి. దీపిక గృహిణి. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 4న ఇంట్లో కుమార్తె పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పుట్టినరోజున చిన్నారికి బంగారు గొలుసు పెడతామని దీపిక తల్లిదండ్రులు చెప్పి పెట్టకపోవడంతో గొడవలు జరిగాయి.
గురువారం ఏడుస్తున్న చిన్నారిని తీసుకుని దీపిక మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లింది. చిన్నారిని చంపి, తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీపిక గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులను బలంగా నెట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందింది. దీపిక తండ్రి ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు, కుటుంబ గొడవలతో ఓ చిన్నారిని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడటంతో పరిసర ప్రాంతాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. దంపతుల మధ్య గొడవ చిన్నారి మరణానికి కారణం కావడం స్థానికులను కలిచి వేసింది.