బంగారు భారత్
ABN , First Publish Date - 2022-01-29T08:50:26+05:30 IST
2021లో పసిడి గిరాకీ 797.3 టన్నులు జూ 2020తో పోలిస్తే 78.6ు వృద్ధి జూ ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి ...
2021లో పసిడి గిరాకీ 797.3 టన్నులు
2020తో పోలిస్తే 78.6% వృద్ధి
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి
ముంబై: కరోనా కష్టాలు వెంటాడినప్పటికీ గత ఏడాది భారతీయులు బంగారం భారీగానే కొనుగోలు చేశారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే 2021లో పసిడి గిరాకీ 78.6 శాతం ఎగబాకి 797.3 టన్నులకు పెరిగిందని రిపోర్టు తెలిపింది. 2020లో డిమాండ్ 446.4 టన్నులుగా నమోదైంది. వినియోగదారుల్లో సెంటిమెంట్ మళ్లీ మెరుగవడంతో పాటు పెంట్అప్ డిమాండ్ ఇందుకు ప్రధానంగా దోహదపడిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. బులియన్ మార్కెట్లో ఈ బుల్లిష్ ట్రెండ్ ఈ ఏడాదీ కొనసాగనుందని ధీమా వ్యక్తం చేసింది. మున్ముందు బులియన్ మార్కెట్కు మళ్లీ అవాంతరాలు ఎదురుకాకుండా ప్రస్తుత పరిస్థితులిలాగే కొనసాగితే, ఈ ఏడాది పసిడి గిరాకీ 800-850 టన్నులకు పెరగవచ్చని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ, ఇండియా, సోమసుందరం పీఆర్ అంచనా వేశారు. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
ప్రపంచ గిరాకీలో 10% వృద్ధి
గత ఏడాది ప్రపంచవ్యాప్త పసిడి గిరాకీ 10 శాతం పెరిగి 4,021.3 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2020లో ప్రపంచ డిమాండ్ 3,658.8 టన్నులుగా నమోదైంది. నాలుగో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్లు బంగారం కొనుగోళ్లు పెంచడంతో పాటు భారత్, చైనాలో జువెలరీ గిరాకీ గత ఏడాది ప్రపంచ డిమాండ్ వృద్ధికి ప్రధానంగా తోడ్పడ్డాయి.