జూలై 11 నుంచి గోల్కొండ బోనాలు

ABN , First Publish Date - 2021-06-21T13:55:19+05:30 IST

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ప్రధాన పండగ

జూలై 11 నుంచి గోల్కొండ బోనాలు

  • గత ఏడాది కరోనాతో జనాలకు లేని అవకాశం
  • ఈ సారి ప్రజలకు అనుమతి..? 

హైదరాబాద్ సిటీ/గోల్కొండ : తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ప్రధాన పండగ బోనాలు. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలు  జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా గతేడాది ప్రజలను అనుమతించ లేదు. ఆలయ కమిటీ సభ్యులే ఉత్సవాలు జరిపించేశారు. ఈ సారి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో ప్రజలకు అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో బోనాలు ప్రారంభం కావడం ఆనవాయితీ.


ఏటా ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ బోనాలు ప్రారంభం అవుతాయి. అమావాస్య జూలై 10న వస్తుండడంతో 11 ఆదివారం నుంచి బోనాల జాతర మొదలుకానుంది.  ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ, లాల్‌దర్వాజ  మహంకాళి ఆలంయలో పూజలు జరుగుతాయి. తిరిగి కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది.


షెడ్యూల్‌ ఇదీ..

జూలై 11న మొదటి పూజ

15న  రెండో పూజ

18న మూడో పూజ

22న నాలుగో పూజ

25న ఐదవ పూజ

29న ఆరవపూజ

ఆగస్టు 1న ఏడో పూజ

5న ఎనిమిదవ పూజ

8న తొమ్మిదవ పూజ

Updated Date - 2021-06-21T13:55:19+05:30 IST