పెళ్లికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు...

ABN , First Publish Date - 2021-12-09T04:33:42+05:30 IST

పెద్దముడియం మండలంలోని భీమగుండంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తూ అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు.

పెళ్లికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు...
మృతి చెందిన నరసింహారెడ్డి, రామనాథ్‌

బైకును ఢీకొన్న ఐచర్‌ వాహనం : ఇరువురు మృతి

ముద్దనూరు డిసెంబరు 8: పెద్దముడియం మండలంలోని భీమగుండంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తూ అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సీఐ హరినాథ్‌ సమాచారం మేరకు... అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మొలకతాండ్ల గ్రామానికి చెందిన కదిరి నరసింహారెడ్డి (48), రామనాథ్‌ (35) గ్రామం నుంచి బైకుపై పెద్దముడియం మండలం భీమగుండంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి బైకుపై వచ్చారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె సమీపంలోకి వెళ్లగానే తాడిపత్రి వైపు నుంచి టమోటా పండ్లలోడు తీసుకుని వస్తున్న ఐచర్‌ వాహనం ఎదురుగా వస్తున్న  బైకును ఢీకొంది. దీంతో బైకులో ఉన్న కదిరి నరసింహారెడ్డి తలకు పెద్ద గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామనాథ్‌ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఐచర్‌ వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-12-09T04:33:42+05:30 IST