కుమారుడి ఫీజు కట్టి వెళుతూ...

ABN , First Publish Date - 2022-08-18T05:30:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో బాబాయ్‌, అబ్బాయ్‌లు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు-చిట్వేలి ఘాట్‌ రోడ్డులో రాపూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది.

కుమారుడి ఫీజు కట్టి వెళుతూ...

రోడ్డు ప్రమాదంలో బాబాయ్‌, అబ్బాయ్‌ల మృతి

టిప్పర్‌ను బైక్‌ ఢీకొని ఘటన


రాపూరు/ఓబులవారిపల్లె, ఆగస్టు 18: రోడ్డు ప్రమాదంలో బాబాయ్‌, అబ్బాయ్‌లు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు-చిట్వేలి ఘాట్‌ రోడ్డులో రాపూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన కె.జయరామయ్య (68), ఎ.సుబ్రమణ్యం (40) వరుసకు వరుసకు బాబాయ్‌, అబ్బాయ్‌లు. సుబ్రమణ్యం కుమారుడు నరసింహ (17) నెల్లూరులో పాలిటెక్నిక్‌ చదువుతుండగా ఫీజు కట్టేందుకు జయరామయ్యతో కలిసి బైక్‌పై వచ్చాడు. ఫీజు కట్టి కుమారుడిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అటవీ చెక్‌పోస్టు సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌ను వేగంగా బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం రాత్రి 10-30 సమయంలో ప్రమాదం జరిగినా విషయం మాత్రం అర్ధరాత్రి వెలుగుచూసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను రాపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడిని చూసేందుకు వెళ్లిన బాబాయ్‌, అబ్బాయ్‌లు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు రాపూరుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తన కోసం వచ్చి అప్పటివరకు తనతో గడిపిన తండ్రి, తాతలు మృత్యువాత పడడంతో తనయుడు తల్లడిల్లిపోయాడు. ఎస్‌ఐ క్రాంతికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు గురువారం ప్రమాద స్థలిని, మృతదేహాలను పరిశీలించి సుబ్రమణ్యం భార్య భాగ్యమ్మ, కుమారుడు నరసింహను విచారించారు.  

Updated Date - 2022-08-18T05:30:00+05:30 IST