ఈత నేర్చుకునేందుకు వెళ్లి

ABN , First Publish Date - 2021-04-21T07:04:48+05:30 IST

కుమారుడికి ఈత నేర్పేందుకు తీసుకువెళ్లిన తండ్రి చూస్తుండగానే బావిలో మునిగి బాలుడు మృత్యువాతపడ్డాడు.

ఈత నేర్చుకునేందుకు వెళ్లి
బాలసాయి(ఫైల్‌)

 బావిలో మునిగి బాలుడి మృతి

కేతేపల్లి, ఏప్రిల్‌ 20: కుమారుడికి ఈత నేర్పేందుకు తీసుకువెళ్లిన తండ్రి చూస్తుండగానే బావిలో మునిగి బాలుడు మృత్యువాతపడ్డాడు. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెం  గ్రామానికి చెందిన దొంగరి నాగరాజుకు కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య  ఆరేళ్ల క్రితం మృతి చెందడంతో పిల్లలిద్దరిని నాగరాజు పెంచుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కుమారుడు బాలసాయి(10)కి ఈత నేర్పించేందుకు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావికి తీసుకెళ్లాడు. ఈతకు సిద్ధమవుతుండగా తండ్రి నాగరాజు వద్ద నుంచి బావి ఆవలి వైపునకు వెళ్లిన బాలసాయి పట్టుతప్పి బావిలో పడిపోయాడు. దీంతో నివ్వెరపోయిన తండ్రి నాగరాజు తేరుకుని కుమారుడిని కాపాడేందుకు బావిలోకి దూకేసరికే బాలుడు బావిలో గల్లంతయ్యాడు. బాలుడికోసం తండ్రి నాగరాజు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో స్థానికులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి కేతేపల్లి పోలీసులు, నకిరేకల్‌ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది చేరుకుని మోటార్ల ద్వారా బావిలో నీటినితోడే పనులు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున బావి వద్దకు తరలి వచ్చి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసే వరకూ అక్కడే ఉన్నారు. బావి పెద్దదికావడంతో నీటినితోడే పనులు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగించారు. రాత్రి 8.30గంటలకు బావి నుంచి మృతుడు బాలసాయి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టంకోసం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  బాలసాయి స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. 

Updated Date - 2021-04-21T07:04:48+05:30 IST