గోదావరిలోకి దూకిన యువకుడు
ABN , First Publish Date - 2022-08-10T05:46:42+05:30 IST
కోనసీమ జిల్లా మురమళ్ల బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఐ.పోలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఐ.పోలవరం, ఆగస్టు 9: కోనసీమ జిల్లా మురమళ్ల బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఐ.పోలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన దంగేటి శ్రీతేజ(24) మంగళవారం మధ్యాహ్నం మురమళ్ల గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. ముమ్మిడివరం మండలం రాజుపాలెం వద్ద తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్న శ్రీతేజ హోండా యాక్టివాను బ్రిడ్జిపై పార్క్చేసి గోదావరిలోకి దూకాడు. ఆ సమయంలో అక్కడున్న వారు ఐ.పోలవరం పోలీసులకు సమాచారం అందజేశారు. ఐ.పోలవరం ఏఎస్ఐ బి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని పడవ ద్వారా యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు శ్రీతేజకు మూడునెలల క్రితం వివాహమైంది. సోదరుడితో కలిసి రాజుపాలెంలో నివాసం ఉంటున్న శ్రీతేజ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోదావరిలోకి దూకడానికి గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సీహెచ్ రాజేష్ తెలిపారు.