ముంపు భయం
ABN , First Publish Date - 2022-08-12T07:24:45+05:30 IST
వరద భయం పీడిస్తోంది. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. జూలైలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు అత్యధికంగా సుమారు 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సంగతి తెలిసిందే.
- ఇప్పటికే 1152 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం
- 450 హెక్టార్లలో వరి మునక.. ఇంకా పెరుగుతున్న వరద
- బ్యారేజీ నుంచి 14,09,029 క్యూసెక్కులు సముద్రంలోకి
రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 11: వరద భయం పీడిస్తోంది. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతోంది. జూలైలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు అత్యధికంగా సుమారు 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వరి చేలు వందలాది హెక్టార్లలో మునిగిపోయాయి. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1152 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. జూలై నుంచి ప్రస్తుతం వచ్చిన వరద వరకు కూడా అనేక వరిచేలు నీటలోనే ఉన్నాయి. పెరవలి, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం, కోరుకొండ, నిడదవోలు ప్రాంతాల్లో వరిపొలాలు మునిగాయి. ప్రస్తు తం ఎర్రకాలువ పొంగడం వల్ల నిడదవోలు మండలంలోనూ, వరద, వానల వల్ల రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లోనూ 450 హెక్టార్లలో వరి ఆయకట్టు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పూర్తిగా నీరు లాగితేనే గానీ నష్టం చెప్పలేమంటున్నారు. ఈ హెక్టార్లలో ఇక వరినాట్లు పూర్తిగా దెబ్బతిన్నట్టేనని రైతులు చెబుతున్నారు. ఆయా చేలల్లో చాలా రోజుల నుంచి నీరు నిలిచే ఉంది. ఇప్పుడు మళ్లీ వరద రావడంతో ఉన్న నీరు కూడా లాగడంలేదు. ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటే మరింత నష్టం ఉంటుంది.
బ్యారేజీ నుంచి దిగువకు 14,09,029 క్యూసెక్కులు..
గోదావరి వరద ఉధృతి వల్ల ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు 14,09,029 క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీ నీటిమట్టం 14.6 అడుగులుగా ఉంది. పాండ్ లెవల్ 15.11 మీటర్లుగా ఉంది. కాల్వలకు 7,200 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్తోపాటు అనేక ఘాట్లు, ఘాట్లలోని ఆలయాలు మునిగిపోయాయి. రాజమహేంద్రవరం అఖండగోదావరి మహా సముద్రంలా మారింది. ఇంకా లంకల్లోకి వెళ్లలేదు. కానీ మరింత పెరిగితే ముల్లకలంక, మద్దూరిలంకలకు మళ్లీ సమస్యే. మద్దూరిలంకకు ఓవైపు బ్యారేజీ ఉంది. ముల్లకలంకకు చుట్టూ గోదావరే. ఇప్పటికే లంకల్లో పంటలన్నీపోయాయి. పశువులకు మేత కూడా లేకుండాపోయింది.
నీట మునిగిన గోష్పాద క్షేత్రం
కొవ్వూరు, ఆగస్టు 11: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కొవ్వూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు దాటి వరద పెరగడంతో దిగువన కొవ్వూ రు వద్ద అఖండ గోదావరి సుడులు తిరుగుతూ పరీవాహక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. వరద పోటెత్తి నెల రోజులు గడవక ముందే మరోసారి కొవ్వూ రు గోష్పాదక్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలను పూర్తి గా వరద ముంచెత్తింది. క్షేత్రంలోని షిరిడి సాయిబాబా ఆలయం మళ్లీ ముంపు చుట్టుముట్టింది. గోదావరి వర ద ప్రమాద భరతంగా ప్రవహిస్తుండడంతో కొవ్వూరు పట్టణ సీఐ ఏఎల్ఎస్. రవికుమార్ ఆధ్వర్యంలో గోష్పాదక్షేత్రానికి వెళ్లే రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రజలు గోదావరిలోకి వెళ్లకుండా బందోబస్తు ఏర్పా టుచేశారు. గోదావరి వరద పెరుగుతుండడంతో నదీ పరీవాహాక ప్రాంతమైన మద్దూరులంక, పల్లిపాలెంలో కొవ్వూరు తహశీల్దార్ బి.నాగరాజు నాయక్, రెవెన్యూ సిబ్బంది పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లిపాలెం వద్ద నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద మరింత పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు సూచించారు. ఏ సమయంలోనైనా వరద ఉధృతి మరింత పెరగవచ్చని, ముందస్తు జాగ్రత్త చర్యగా మద్దూరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని కోరారు.