ఉరుకున..పరుగున గోదారి
ABN , First Publish Date - 2021-07-25T05:02:51+05:30 IST
గోదావరి పోటెత్తింది. ఎగువ ప్రాం తాల నుంచి వస్తున్న వరదతో ఉరుకులు.. పరుగులుపెడుతూ నిండుగా ప్రవహిస్తోంది.
నేడు వశిష్ఠను తాకనున్న వరద
కోడేరు వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఆచంట/ నరసాపురం, జూలై 24: గోదావరి పోటెత్తింది. ఎగువ ప్రాం తాల నుంచి వస్తున్న వరదతో ఉరుకులు.. పరుగులుపెడుతూ నిండుగా ప్రవహిస్తోంది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఎగువప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వర్షపునీరు గోదావరిలోకి చేరుతుండడంతో గోదావరి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చ రిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతం నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు పోటెత్తడంతో వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేవ్వరం వద్ద 6 లక్షల కూసె క్కుల నీటిని విడుదల చేస్తే వశిష్ఠకు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఏటిగట్టుల అభివృద్థిశాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. ముందస్తుగా ఆ శాఖ ఇంజనీర్ సుబ్బారావు శనివారం గోదా వరి పరీవాహక ప్రాంతాన్ని సందర్శించారు. స్లూయిస్, లాకు తలు పులు, ఏటిగట్లలను తనిఖీ చేశారు. మాధవాయిపాలెం, పీచుపాలెం, దర్భ రేవు, ముస్కేపాలెం స్లూయిస్ తలుపులను మూయించి వేశారు. గట్లు లీకేజీలు ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేసి పటిష్టపర్చారు.నరసాపురం నుంచి సిద్ధాంతం వరకు గట్టును పరిశీలించేందుకు లస్కర్లను నియమిం చారు. ఆచంట మండలం కోడేరు వద్ద పుష్కరఘాట్లోకి వరదనీరు చేరింది. కోడేరు వద్ద గోదావరి పరిస్థితిని తహసీల్దార్ నజీం ముల్లాషా, ఎస్ఐ వెంకటరమణ తదితరులు పరిశీలించారు. మరోవైపు వరద హెచ్చ రికతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. గోదావరిలో చేపల కోసం కట్టిన వలకట్టలను తొలగించుకుంటున్నారు. బోట్లను దరి చేర్చుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నీట మునిగిన ఆలయాలు
పెనుమంట్ర, జూలై 24 : భారీ వర్షాలకు డ్రెయినేజీలు పొంగి నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి గోస్తనీ కాలువ వరద నీరు చేరింది. జుత్తిగలోని ఉమావాసుకీ రవి సోమేశ్వరస్వామి వారి ఆలయంలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం నీట మునిగిపోయింది. ఆలయ అర్చకులు నీటిలోనే స్వామివార్లకు పూజలు చేశారు.