Godavari floods: పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-08-11T02:55:41+05:30 IST

గోదావరి వరద (Godavari flood) నెమ్మదిగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద

Godavari floods: పెరుగుతున్న గోదావరి

పోలవరం: గోదావరి వరద (Godavari flood) నెమ్మదిగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. కాగా తెలంగాణ (Telangana) అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గోదావరి వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా పెరిగిన గోదావరితో సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారి కూడా నీట మునిగాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.


వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరద చుట్టుముట్టింది. గత నెలలో సంభవించిన గోదావరి వరదలకు ఇళ్లు కూలిపోయి బురదమట్టి పేరుకుపోవడంతో కొద్ది మంది తప్ప మిగతా వారంతా బయట ప్రాంతాల్లోనే తలదాచుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇలాంటి తరుణంలో వరద మరోసారి గ్రామాలపై విరుచుకు పడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మళ్లీ పెట్టెబేడా సర్ధుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. గోదావరి నదికి ఎగువ భాగాన్న వరద తక్కువగానే ఉన్నప్పటికీ శబరి, పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా గతం కంటే 8 అడుగుల వరద నీరు అధికంగా వచ్చి చేరింది. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) కాఫర్‌ డ్యామ్‌ ఎగువన గోదావరి నీటిమట్టం 33.370 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 24.760 మీటర్లు నమోదయ్యింది. పోలవరం వద్ద 24 మీటర్లు నమోదయ్యింది. 10,10,387 క్యూసెక్కుల వరద జలాలను జలవనరులశాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2022-08-11T02:55:41+05:30 IST