వేడుకగా గోదా కల్యాణం
ABN , First Publish Date - 2021-01-16T05:40:33+05:30 IST
తిరుపతిలోని టీటీడీ పరిపాలనం వెనుక మైదానంలో గురువారం సాయంత్రం శ్రీకృష్ణ, గోదా కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు.
తిరుపతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని టీటీడీ పరిపాలనం వెనుక మైదానంలో గురువారం సాయంత్రం శ్రీకృష్ణ, గోదా కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. భౌతికదూరం పాటిస్తూ భక్తులు కల్యాణంలో పాల్గొనేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ధనుర్మాసానిక వీడ్కోలు, మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ గోదా కల్యాణం నిర్వహిస్తున్నట్టు డీపీపీ కార్యదర్శి రాజగోపాలన్ తెలిపారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు శేషాచల కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులచేత సంకల్పం చేయించారు. ఆభరణాలు, పుష్ప మాలలతో విశేషంగా అలకరించిన గోదాదేవి, కృష్ణస్వామికి కంకణాలు కట్టి, వేద మంత్రాలతో కల్యాణం జరిపించారు. అనంతరం గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ వారణమాయిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.