కన్నుల పండుగగా లక్ష్మీ సమేత గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం
ABN , First Publish Date - 2022-01-15T05:20:45+05:30 IST
ధనుర్మాసం చివరి రోజు కావడంతో శుక్రవారం శ్రీ లక్ష్మీ సమేత గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.
బీర్కూర్, జనవరి 14: ధనుర్మాసం చివరి రోజు కావడంతో శుక్రవారం శ్రీ లక్ష్మీ సమేత గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గత నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు టీటీడీలో కొనసాగుతున్నాయి. అయితే, శుక్రవారం ధనుర్మాసం చివరి రోజు కావడంతో లక్ష్మీ సమేత గోదా రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిమ్మాపూర్ గ్రామస్థులు స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన శ్రీ వారి భక్తుడు టేకుల రామకృష్ణ మమత దంపతులు స్వామి వారికి స్వర్ణ కిరీటం కోసం తమవంతుగా 5 గ్రాముల బంగారాన్ని తమవంతుగా అందజేశారు. ఆలయ ధర్మకర్త శంభురెడ్డి సతీ సమేతంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, ద్రోణవల్లి సతీష్, అశోక్, నర్సరాజు, రాంబాబు, మురళీ, అప్పారావు, ఉప్పలపాటి సత్యనారాయణ, ఆలయ కమిటీ మేనేజర్ విఠల్, ప్రధాన అర్చకులు నంద కిషోర్, అభిషేక్ ఆచార్య తదితరులున్నారు.