America: అగ్రరాజ్యంలో ఘోరం.. భారత యువకుడిని కాల్చి చంపిన దుండగుడు!
ABN , First Publish Date - 2022-03-23T17:49:37+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. భారత యువకుడిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు.
హూస్టన్, టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. భారత యువకుడిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. టెక్సాస్లోని హూస్టన్లో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గోవాకు చెందిన జాన్ దియాస్(27) అనే యువకుడిని అతడు పనిచేసే చోటనే దుండగుడు హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పరారీలో ఉన్న దుండగుడి కోసం హూస్టన్ పోలీసులు గాలిస్తున్నారు.
విరాల్లోకి వెళ్తే.. గోవాలోని చందోర్కు చెందిన జాన్ దియాస్(27) అనే యువకుడు టెక్సాస్లోని హూస్టన్లో స్థానికంగా ఉండే ఓ గ్యాస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్గా పని చేస్తున్నాడు. ప్రతిరోజులానే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లాడు. దియాస్ కౌంటర్పై ఉండగా అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. అప్పటికే కౌంటర్ వద్ద కొంతమంది కస్టమర్లు ఉండడంతో కొద్దిసేపు వేచి చూశాడు. కస్టమర్లు అందరూ వెళ్లిపోయిన తర్వాత తుపాకీ గురిపెట్టి కౌంటర్లోని నగదు మొత్తం తీసి ఇవ్వాలని దియాస్ను బెదిరించాడు. కానీ, దియాస్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. చాలా దగ్గరి నుంచి పాయింట్ బ్లాంక్లో కాల్చడంతో దియాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు.
అనంతరం దుండగుడు కౌంటర్లోని నగదు తీసుకుని పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. వాటి ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. రెండేళ్ల క్రితం దియాస్ యూఎస్కు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు అతడు గోవాలోని ఓ హోటల్లో పని చేశాడు. ఒక్కగాను ఒక్క కొడుకు ఇలా హత్యకు గురికావడంతో దియాస్ తల్లి కన్నీరుమున్నీరు అవుతుంది. చందోర్లో విషాదం అలుముకుంది.