Goa controversial: సీఎం ప్రమోద్ సావంత్ యూ టర్న్
ABN , First Publish Date - 2021-07-30T17:03:14+05:30 IST
బాలికలపై చేసిన వ్యాఖ్యలకు గాను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ యూటర్న్ తీసుకున్నారు....
పనాజీ (గోవా): బాలికలపై చేసిన వ్యాఖ్యలకు గాను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ యూటర్న్ తీసుకున్నారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆగ్రహం ఎదుర్కొన్న సావంత్ తాను సందర్భం లేకుండా మాట్లాడానని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దురదృష్ణకరమైన సంఘటన గురించి ప్రభుత్వానికి అధిపతిగా తానెంతో బాధపడ్డానని సావంత్ చెప్పారు.దురదృష్ణ కరమైన ఘటన తర్వాత మైనర్ బాలికలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. కాగా ‘‘గోవాలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారి పోతుందని, రాత్రిపూట మనం తిరిగేటపుడు మనం ఎందుకు భయపడాలి? నేరస్థులు జైలులో ఉండాలి, చట్టాన్ని గౌరవించే పౌరులు స్వేచ్ఛగా తిరగాలి’’అని గోవా కాంగ్రెస్ ప్రతినిధి ఆల్టోన్ డి కోస్టా చెప్పారు.
పౌరుల భద్రత పోలీసు, ప్రభుత్వ బాధ్యత అని, వారు దాన్ని ఇవ్వలేకపోతే పదవిలో ఉండటానికి హక్కులేదని గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ అన్నారు. గోవాలోని బెనాలిమ్ బీచ్లో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. అయితే రాత్రిళ్లు అమ్మాయిలు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. పిల్లలు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కూడా వ్యాఖ్యానించారు. ప్రజల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి వారినే నిందిస్తున్నారని, పైగా లింగ బేధాలు చూపిస్తూ ఆడవారిని చిన్నచూపు చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.