Goa క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై...కమలం పార్టీలో కలకలం

ABN , First Publish Date - 2022-01-11T16:54:33+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెపుతుండటంతో కమలనాథులు కలవర పడుతున్నారు...

Goa క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై...కమలం పార్టీలో కలకలం

పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెపుతుండటంతో కమలనాథులు కలవర పడుతున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14వతేదీన జరగనుండగా, సోమవారం కలాంగుటే ఎమ్మెల్యే, మంత్రి మైఖేల్ లోబో ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా మైఖేల్ లోబో బీజేపీ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. సియోలిమ్ నియోజకవర్గం నుంచి తన భార్య దలీలాకు టికెట్ ఇవ్వాలని కోరుతూ లోబో లాబీయింగ్ చేశారని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన మైఖేల్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే లోబో భార్య అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. 


దీంతో లోబో కాంగ్రెస్ పార్టీలో చేరిక పెండింగులోనే ఉంది. దీంతో మైఖేల్ ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ మైఖేల్ లోబోతో మాట్లాడారని తెలిసింది. కలంగుటే ఎమ్మెల్యే లోబో ఉత్తర గోవాలో బలమైన నాయకుడు. లోబో కనీసం అయిదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తారని భావిస్తున్నారు. లోబోను తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతం అయితే బీజేపీ ప్రాబల్యం ఉన్న ఉత్తరగోవాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. బీజేపీని వీడిన ఎమ్మెల్యే లోబోతోపాటు గత నెలలో కార్టోలిమ్ బీజేపీ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా కూడా ఆ పార్టీని వీడారు.


అలీనా ఆప్ పార్టీలో చేరారు. వాస్కోకు చెందిన మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే కార్లోస్ అల్మేడా కూడా కాషాయపార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి దూరమవుతారని ఊహాగానాలు సాగుతున్నాయి. వెలిమ్ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్ నెరి రోడ్రిగ్జ్, నువెమ్ ఎమ్మెల్యే విల్ఫ్రేడిసా అలియాస్ బాబాషన్ కూడా బీజేపీని వీడతారని ప్రచారం సాగుతోంది. క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ టికెట్టు ఖరారులో అసౌకర్యం, అపజయం భయంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీల వైపు చూస్తున్నారు. 


పార్టీ ఫిరాయింపులు, దురాశ, వ్యక్తిగత ప్రయోజనాల ఏజెండాలు బీజేపీని అడ్డుకోలేవు అని సీఎం సావంత్ ట్వీట్ చేశారు. మాయెమ్ నియోజకవర్గానికి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ జాంబ్వే రాజీనామా చేశారు.ప్రవీణ్ జాంబ్వే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో చేరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-11T16:54:33+05:30 IST