అసెంబ్లీ రికార్డులు ధ్వంసమయ్యాయి: గోవా సీఎం
ABN , First Publish Date - 2022-06-29T01:59:54+05:30 IST
గోవా అసెంబ్లీ(Goa Assembly) తొలి సమావేశాలు జరిగిన 1963 నుంచి 2000వ సంవత్సరం వరకు గల రికార్డులన్నీ(Records) ధ్వంసమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Chief Minister Pramod Sawant) తెలిపారు..
పనాజీ: గోవా అసెంబ్లీ(Goa Assembly) తొలి సమావేశాలు జరిగిన 1963 నుంచి 2000వ సంవత్సరం వరకు గల రికార్డులన్నీ(Records) ధ్వంసమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Chief Minister Pramod Sawant) తెలిపారు. సచివాలయాన్ని నూతన భవనానికి తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాజాగా ఆయన మాట్లాడుతూ ‘‘నిజానికి ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ రికార్డులను కాపాడాలనే అనుకున్నాను. కానీ కాపాడలేకపోయాను. అన్ని రికార్డులు ధ్వంసమయ్యాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డులను మాత్రమే ఉన్నాయి. వాటిని భద్రపరుస్తాము. అలాగే వాటిని డిజిటలైజ్ చేస్తాము’’ అని అన్నారు.
2000 సంవత్సరంలో ఆదిల్ షా పాలెస్ నుంచి సచివాలయాన్ని కొత్త భవనంలోకి మార్చారు. ఆ సమయంలోనే గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బందోద్కర్ ప్రసంగాల నుంచి అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు అన్నీ ధ్వంసమయ్యాయని సావంత్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న రికార్డులను సీడీ రూపంలో, ఇతర ఆధునిక టెక్నాలజీలోకి మార్చి భద్రపరుస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఎమ్మెల్యేలు వీటిని ఉపయోగించుకునేలా డిజిటలైజ్ చేస్తామని అన్నారు. తాను గోవా అసెంబ్లీకి స్పీకర్ అయినప్పుడే ఈ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని తెలిసినట్లు ఆయన తెలిపారు. 1961లో పోర్చుగీస్ పాలన నుంచి విముక్తం పొంది భారత్లో విలీనమైన తర్వాత 1963లో మొట్టమొదటి గోవా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.