దూర దేశానికి వెళ్లి.. దూరమై పోయావా..

ABN , First Publish Date - 2021-11-30T06:56:40+05:30 IST

దూర దేశానికి వెళ్లి దూరమై పోయావా అం టూ నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరటిగూడెం శోకసంద్రమైంది.

దూర దేశానికి వెళ్లి.. దూరమై పోయావా..
నల్లగొండ జిల్లా తేరటిగూడెంలో శేఖర్‌ అంతిమయాత్ర నిర్వహిస్తున్న బంధువులు, గ్రామస్థులు

బోరున విలపించిన తల్లిదండ్రులు, బంధువులు

అమెరికాలో ఈ నెల 19న నల్లగొండ యువకుడి మృతి

స్వగ్రామానికి చేరిన శేఖర్‌ భౌతిక కాయం

గుర్రంపోడు, నవంబరు 29: దూర దేశానికి వెళ్లి దూరమై పోయావా అం టూ నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేరటిగూడెం శోకసంద్రమైంది. అమె రికాలోని హోవార్డు ప్రాంతం ఎల్లినాట్‌సిటీలో ఈ నెల 19వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలి శేఖర్‌(28) భౌతికకాయం సోమవారం స్వగ్రామమైన తెరాటిగూడేనికి తీసుకొచ్చారు. ఎంబీఏ పూర్తిచేసి ఇటాలియన్‌ యూనివర్సీటీ ద్వారా మాస్టర్‌ డిగ్రీ చదివేందుకు 2018లో అమెరికాకు వెళ్లిన శేఖర్‌ అక్కడ ఈ వెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈనెల 19వ తేదీ సాయంత్రం 6:30గంటలకు అమెరికాలోని హోవార్డు ప్రాంతం ఎల్లినాట్‌సిటీలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. శేఖర్‌ మిత్రులు ఈ నెల 20న కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేం దుకు ఎమ్మెల్యే నోముల భగత్‌ బావ, ఎన్‌ఆర్‌ఐ కటకం క్రాంతికుమార్‌తో పాటు శేఖర్‌ స్నేహితులు విరాళాలు సేకరించి సహకారమందించారు. మృతదేహాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తేరటిగూడెం తరలివచ్చారు. 

మిన్నంటిన రోదనలు

అమెరికా నుంచి 10రోజుల అనంతరం మృతదేహం ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. దూరదేశానికి వెళ్లి మమ్ములను విడిచి కానరాని లోకానికి దూరంగా వెళ్లిపోయావా చిన్నా...’ అంటూ శేఖర్‌ తల్లిదండ్రులు ముత్యాలు, కొమరమ్మ విలపిస్తున్న తీరు అంత్యక్రియలకు వచ్చినవారిని కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. నివాళులర్పించిన వారిలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, వైస్‌ ఎంపీపీ వజ్జ రామేశ్వరిధనుంజయ, సర్పంచులు మస్రత్‌జహసయ్యద్‌మియా, పాల్వాయి కరుణ శ్రీను తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-11-30T06:56:40+05:30 IST