ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2021-05-13T06:43:52+05:30 IST

సరదా కోసం ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన కడప జిల్లా లింగాల మండలంలో జరిగింది.

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

యల్లనూరు/లింగాల, మే 12: సరదా కోసం ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన కడప జిల్లా లింగాల మండలంలో జరిగింది. ఎస్‌ఐ హాజీవలి కథనం మేరకు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రా మానికి చెందిన హరికృష్ణ (22) అనే యువకుడు నీటి గుంతలో గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాల కుడికాల్వ పక్కలో ఉన్న కుంట వద్దకు ఈతకు వెళ్లారు. ఈ కుంట చుట్టూ దాదాపు 100 మీటర్లపైనే ఉంటుంది. దీంతో యువకులు అక్కడ ఈతకొడుతూ సరదాగా ఓవైపు నుంచి అవతల వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు అవతలి వైపునకు వెళ్లిపోగా హరికృష్ణ మాత్రం సగం దూరం వచ్చేసరికి గస ఎక్కువ అవడంతో నీటిలో మునిగిపోయాడు. అందరూ చూస్తుండగానే నీటికుంటలో అడుగుభాగానికి వెళ్లిపోయినట్లు ఈతకు వచ్చిన మిగతా వారు తెలిపారు. దీంతో గ్రామంలోని తల్లిదండ్రులు, బంధువులు గ్రామ ప్రజలు హరికృష్ణ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ కుంట దాదాపు 30 అడుగుల లోతు ఉండడంతో ఎవరూ అంత లోపలికి వెళ్లలేకపోతున్నారు. మైలవరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. హరికృష్ణ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. మృతుడికి తల్లి నరసమ్మ, తండ్రి కేసన్న, తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నట్లు తెలిపారు. చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తానని మమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పి ఇపుడు మాకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు రోదిస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.


Updated Date - 2021-05-13T06:43:52+05:30 IST