విజయమే లక్ష్యంగా ముందుకు సాగండి

ABN , First Publish Date - 2021-01-25T05:07:46+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. జలుమూరు, సారవకోట మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలతో బొంతు కూడలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

విజయమే లక్ష్యంగా ముందుకు సాగండి
జలుమూరు: మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి


జలుమూరు/సారవకోట, జనవరి 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. జలుమూరు, సారవకోట మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలతో బొంతు కూడలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలున్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామాల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధం గా వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు రెండు మండలాల నేతలు వెలమల రాజేంద్రనాయుడు, చంద్రభూషణరావు, బగ్గు గోవిందరావు, కత్తిరి వెంకటరమణ, పి.రత్నాలనాయుడు తదితరులు పాల్గొన్నారు,


‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా నిరూపించండి

దబ్బపాడు(ఎల్‌.ఎన్‌.పేట): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమ సత్తా నిరూపించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి కోరారు. దబ్బపాడులో స్థానిక నాయకులతో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి నియంతగా ప్రజాస్వామ్య వ్యవస్థను పతనం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానాలు తీర్పులిస్తున్నా వాటిని ధిక్కరిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ  మండ ల అధ్యక్ష, కార్యదర్శులు వి.గోవిందరావు, కె.చిరంజీవి, వి.ఆనందరావు, ఎస్‌. తేజేశ్వరరావు, జె.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

 



 

Updated Date - 2021-01-25T05:07:46+05:30 IST