అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
ABN , First Publish Date - 2020-11-01T10:26:14+05:30 IST
రాష్ట్రంలో అధికార వైసీపీ... టీడీపీ నాయకులు, రైతులపై అక్రమంగా కేసులు బనాయించి జైలుపాలు చేయటం మినహా,
మాజీ ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల, అక్టోబరు 31: రాష్ట్రంలో అధికార వైసీపీ... టీడీపీ నాయకులు, రైతులపై అక్రమంగా కేసులు బనాయించి జైలుపాలు చేయటం మినహా, చేసిన అభివృద్ధేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులను అరెస్టు చేసి జైలుకు పంపినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని ఆయన పేర్కొన్నారు. రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడితే సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ మిత్రపక్ష నాయకులను పోలీసులు గృహనిర్బంధాలు చేయటం ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలని యరపతినేని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఏ అభివృద్ధి జరగకపోగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల నిధులను పక్కదారి పట్టించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఉందన్నారు. ఫ్యాక్షన్రాజకీయాలతో భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ మైనింగ్, మద్యం, పాన్పరాగ్, గుట్కా వ్యాపారాలతో వైసీపీ పెద్దలు కోట్లు గడిస్తున్నారని యరపతినేని ఆరోపించారు.