120 మంది అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులపై కేసులు
ABN , First Publish Date - 2020-11-01T10:12:51+05:30 IST
అనుమతి లేకుండా గుంటూరు జైల్ భరో కార్యక్రమం చేపట్టారనే కారణంతో అమరావతి పరిరక్షణ జేఏసీతోపాటు సీపీఐ, ఇతర పార్టీ నాయకులపై అరండల్పేట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.
గుంటూరు, అక్టోబరు 31: అనుమతి లేకుండా గుంటూరు జైల్ భరో కార్యక్రమం చేపట్టారనే కారణంతో అమరావతి పరిరక్షణ జేఏసీతోపాటు సీపీఐ, ఇతర పార్టీ నాయకులపై అరండల్పేట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. గుంటూరు జైల్ భరో కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా 25మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కార్యక్రమానికి వచ్చిన 150మందిలో 120మందికి పైగా నాయకులపై కేసులు నమోదు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ రాయపాటి శైలజ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, దళిత జేఏసీ నాయకులు మార్జిన్ లూధన్కింగ్, సీపీఐ నాయకులు షేక్ వలి, జంగాల చైతన్యతోపాటు 120మందికి పైగా కేసు నమోదుచేసినట్టు అరండల్పేట పోలీసులు తెలిపారు. సెక్షన్ 186, 188, 341, 51తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. కరోనా ఉధృతంగా విస్తరిస్తున్న తరుణంలో నిబంధనలు అతిక్రమించి అనుమతి లేకుండా, పోలీసుల ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేసి విధి నిర్వహణలో ఉన్న పోలీసు విధులకు ఆటంకం కలిగించి ప్రజాజీవనానికి అంతరాయం కలిగించేలా వీరంతా జైలు భరో కార్యక్రమానికి వచ్చారంటూ పోలీసు అధికారులు తెలిపారు.