బేడీలు వేయామని ఎవరు చెప్పారు?
ABN , First Publish Date - 2020-10-31T07:51:18+05:30 IST
రాజధాని దళిత రైతులకు బేడీలు వేయామని ఎవరు చెప్పారని, సీఎం పేషీ నుంచి ఫోన్ వచ్చిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు.
కేసులతో భయపెట్టాలని చూస్తోన్న ప్రభుత్వం
సంకెళ్ల బాధిత కుటుంబాల పరామర్శలో వర్ల రామయ్య ఆగ్రహం
మంగళగిరి, అక్టోబరు 30: రాజధాని దళిత రైతులకు బేడీలు వేయామని ఎవరు చెప్పారని, సీఎం పేషీ నుంచి ఫోన్ వచ్చిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన సంకెళ్ల బాధిత దళిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలను కేసులతో ప్రభుత్వం భయపెట్టాలని చూస్తున్నదన్నారు. దళితులను కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం అట్టే కాలం నిలబడదన్నారు. అమరావతికి మాదిగలు ఇచ్చిన 50 సెంట్ల భూమి, ఇతరులు ఇచ్చిన 100 ఎకరాలతో సమానమన్నారు. బేడీల ఘటనలో అమాయకులైనా ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లను బలి చేశారన్నారు. అమరావతిని రానున్నకాలంలో నిలబెట్టుకుంటామని, వీరోచితంగా పోరాటం చేసిన ఉద్యమ వీరులను సత్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు గడ్డం మార్టిన్, పువ్వాడ సుధాకర్, పులి చిన్నా, కంభపాటి శిరీష, ఈపూరి పెద్దబ్బాయి, ఈపూరి జయకృష్ణ, వేమూరి మైనర్బాబు, తదితరులు పాల్గొన్నారు.