నిందితులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే కాసు
ABN , First Publish Date - 2020-10-01T10:06:21+05:30 IST
నారాయణపురంలో వడ్డెర కార్మికులపై జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అనుచరుడు బయ్యన్న ప్రధాన నిందితుడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.
టీడీపీ నేత యరపతినేని ఆరోపణ
గుంటూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపురంలో వడ్డెర కార్మికులపై జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అనుచరుడు బయ్యన్న ప్రధాన నిందితుడని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఆన్లైన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడిఘటనలో నలుగురు కార్మికులు గాయపడటంతో పాటు నీలకంఠ చనిపోయాడని, ఈ ఘటనకు సంబంధించి 14మందిపై కేసు పెట్టినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీస్శాఖను ప్రశ్నించారు.
నిందితుడిని అరెస్టు చేయకుండా అడ్డుపడటం హేయమైన చర్య అని, ఎమ్మెల్యేకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దాడికి కారకులైన వారిని అరెస్టు చేయించాలని డిమాండ్చేశారు. అంబాపురంలో దళిత యువకుడు విక్రమ్ హత్యకేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని తెలిపారు. భటృపాలెంలో రాజానాయక్ హత్య జరిగి ఏడాదవుతున్నా ఒక్కరినికూడా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు.
నిందితులను అరెస్టు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలుచేస్తూ, పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు బనాయిస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.