వైభవంగా ఆదిదంపతుల కైలాస గిరిప్రదక్షిణ

ABN , First Publish Date - 2021-01-16T06:00:15+05:30 IST

‘మా పెళ్లికి రండి.. కల్యాణాన్ని దిగ్విజయంగా జరిపించండి.. అంటూ శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు, మునీంద్రులకు, సప్తరుషులకు ఆదిదంపతులు ఆహ్వానం పలికారు.

వైభవంగా ఆదిదంపతుల కైలాస గిరిప్రదక్షిణ
పురవీధులుగుండా వెళుతున్న శివ పార్వతులు

శ్రీకాళహస్తి, జనవరి 15: ‘మా పెళ్లికి రండి.. కల్యాణాన్ని దిగ్విజయంగా జరిపించండి.. అంటూ శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు, మునీంద్రులకు, సప్తరుషులకు ఆదిదంపతులు ఆహ్వానం పలికారు. శుక్రవారం పార్వతీపరమేశ్వరుల కైలాస గిరిప్రదక్షిణ(కొండచుట్టు ఉత్సవం) వైభవంగా జరిగింది. మార్చిలో జరగనున్న శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కైలాసగిరి పర్వత సానువులపై కొలువైన దేవ, ముని, సప్తరుషులకు ఆహ్వానం పలకడానికి ఉమాశంకరులు సర్వాభరణశోభితులై గిరిప్రదక్షిణకు బయలుదేరారు. వీరివెంట ఊరందూరు గ్రామ నీలకంఠేశ్వరుడు వెళ్లాడు. ముక్కంటి ఆలయ అలంకార మండపంలో ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఓ చప్పరంపై గంగాదేవీ సమేతుడైన పరమేశ్వరుడు, మరో చప్పరంపై అధిరోహించిన పార్వతీదేవి మోతవారిపై శివయ్య గోపురం గుండా ఆలయం నుంచి బయటకు వచ్చారు. తేరువీధిలో భక్తజనులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించాక మాఢవీధుల గుండా కైలాసగిరి ప్రదక్షిణకు సాగారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని దేవుడిబాటలో 16 కాళ్ల మండపం(అంజూరు మండపం) వద్ద ఉమామహేశ్వరులు కొంతసేపు విడిది చేశారు. రామాపురం మీదుగా సహస్రలింగేశ్వరుడు వెలసిన వెయిలింగాల కోనకు చేరుకున్నారు. అప్పటికే కొండచుట్టుద్వారా ఇక్కడకు వచ్చిన భక్తులు గిరిప్రదక్షిణ ద్వారా వేయిలింగాల కోనకు చేరుకున్న ఆదిదంపతుల దివ్యదర్శనంతో పులకించిపోయారు. అనంతరం వేడాం గ్రామం మీదుగా శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురుసేవ మండపం వద్దకు సాయంత్రం బాగా చీకటిపడిన తర్వాత చేరుకున్న స్వామి, అమ్మవార్లకు భక్తులు స్వాగతం పలికారు. మండపంలో కొలువుదీరిన పార్వతీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ముక్కంటి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ఈవో పెద్దిరాజు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి స్వామి, అమ్మవార్ల పురవిహారం నిలిచిపోయింది. ఎట్టకేలకు కైలాసగిరి ప్రదక్షిణ కోసం ఆదిదంపతుల ఉత్సవమూర్తులు ఆలయం నుంచి పురవీధుల్లోకి వచ్చారు. చాలాకాలం తర్వాత మాఢవీధుల్లో ఆదిదంపతుల దివ్యదర్శనంతో భక్తజనులు పరవశించిపోయారు.

Updated Date - 2021-01-16T06:00:15+05:30 IST