వైభవంగా గడిమైసమ్మ బోనాలు
ABN , First Publish Date - 2022-08-15T05:45:31+05:30 IST
వైభవంగా గడిమైసమ్మ బోనాలు
మేడ్చల్/ఘట్కేసర్ : 14, ఆగస్టు : మేడ్చల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గడిమైసమ్మ బోనాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల గడిమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ఆదివారం మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమాభిషేకంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం ఏడుగుళ్ల నుండి గడిమైసమ్మ ఆలయం వరకు ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఫలహార బండ్ల ఊరేగింపు సందర్భంగా వివిధ వేషధారణాలు, పోతరాజుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు మంత్రిని శాలువాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. మేడ్చల్ హౌజింగ్ బోర్డు కాలనీలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మెరుగు మోహన్రెడ్డి, రామస్వామిముదిరాజ్, టీఆర్ఎస్ యువజన నాయకుడు తేజరెడ్డి ఆధ్వర్యంలో ఫలహారబండి ఊరేగింపు నిర్వహించారు.
- ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో ఘనంగా బోనాలు
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల పరిధిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఘట్కేసర్లో, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ, రాజీవ్గృహకల్ప కాలనీ, దివ్యాంగుల కాలనీల్లో బోనాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే పోచమ్మ, మహంకాళి, చిత్తారమ్మ అమ్మవార్ల ఆయాలను భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. రాజీవ్ గృహకల్పకాలనీలో సముహికంగా బోనాల ఉరేగింపు నిర్వహించారు. ఘట్కేసర్లో ఉదయం నుండే ఎవరికి వారు బోనాలు సమర్పించారు. శివసత్తుల, పోతరాజుల నృత్యాలు, అందరినీ ఆకట్టుకున్నాయి. ఘట్కేసర్లోలు ఫలహారం బండ్ల ఊరేగింపులు నిర్వహించారు.