వైభవంగా రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-17T05:23:18+05:30 IST
తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ జాతర సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
హుస్నాబాద్, మే 16: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ జాతర సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరను తెల్లవారుజామునే సిద్ధోగంతో ప్రారంభించారు. ఎల్లమ్మదేవిని స్థుతిస్తూ ఆమె చరిత్రను పంబాల పూజారులు ఆటపాటల ద్వారా వివ రించారు. అనంతరం ఎల్లమ్మ కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. దాదాపు 6 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ రజిత అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఇందులో పోతరాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి బోనాలు, చీరలు పెట్టి ఓడివాల బియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అనిత, అలయ ఈవో విశ్వనాథశర్మ, కమిషనర్ రాజమల్లయ్య, ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, భాగ్యరెడ్డి పాల్గొన్నారు.