విద్యాప్రదాతకు గుర్తింపు

ABN , First Publish Date - 2020-12-05T08:03:52+05:30 IST

చాలా మంది భారతీయుల్లాగే రంజిత్‌సిన్హ్‌ దిసాలే(32) కూడా ఐటీ ఇంజనీర్‌ కావాలని కలలు కన్నాడు. పరిస్థితుల కారణంగా ఆ కలను సాకారం చేసుకోలేకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని రంజిత్‌ తండ్రి అతడిని ఒప్పించారు...

విద్యాప్రదాతకు గుర్తింపు

  • మహారాష్ట్ర ఉపాధ్యాయుడికి గ్లోబల్‌ ప్రైజ్‌
  • బహుమతిగా రూ.7.37 కోట్లు 

న్యూఢిల్లీ, డిసెంబరు 4: చాలా మంది భారతీయుల్లాగే రంజిత్‌సిన్హ్‌ దిసాలే(32) కూడా ఐటీ ఇంజనీర్‌ కావాలని కలలు కన్నాడు. పరిస్థితుల కారణంగా ఆ కలను సాకారం చేసుకోలేకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని రంజిత్‌ తండ్రి అతడిని ఒప్పించారు. ఆ వృత్తే ఇప్పుడు రంజిత్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలికా విద్యను ప్రోత్సహించినందుకు, బాలికలను చదివించినందుకు రంజిత్‌.. గ్లోబల్‌ టీచర్‌ బహుమతిని దక్కించుకున్నారు. ఈ బహుమతి కింద రూ.7.37 కోట్లను గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా పరిటేవాడీలో జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రంజిత్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇక్కడ గిరిజన బాలికలకు విద్య ఒక్కటే కాదు, భాష కూడా సమస్యే. ఆ బాలికలకు కన్నడ మాత్రమే తెలుసు. దీంతో రంజిత్‌ కన్నడ నేర్చుకొని విద్యాబోధన చేశారు. దీంతో పాటు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు పాఠ్యపుస్తకాలన్నింటినీ కన్నడలో క్యూఆర్‌ కోడ్‌తో రీడిజైన్‌ చేయించారు. మహారాష్ట్రలో ఈవిధంగా చేసిన తొలి పాఠశాల అదే. రంజిత్‌ కృషితో 2016లో ఈ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాల అవార్డు పొందింది. అదే ఏడాది ‘ఇన్నొవేటివ్‌ రిసర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. తనకు దక్కిన బహుమతిలో (7.37 కోట్లు) సగం డబ్బును తన పది మంది ఫైనలిస్టులతో పంచుకుంటానని దిసాలే స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-05T08:03:52+05:30 IST