హజ్ కమిటీల ఏర్పాటుపై సమాధానం ఇవ్వండి
ABN , First Publish Date - 2022-08-13T08:56:19+05:30 IST
హజ్ కమిటీల ఏర్పాటు విషయమై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 12: హజ్ కమిటీల ఏర్పాటు విషయమై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కమిటీల సభ్యుల వివరాలను కూడా ఇవ్వాలని తెలిపింది. హజ్ కమిటీల ఏర్పాటుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను చాలా రాష్ట్రాలు అమలు చేయలేదంటూ సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాంతో జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. హజ్ కమిటీ చట్టం-2002 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా దాన్ని పాటించడం లేదంటూ సెంట్రల్ హజ్ కమిటీ మాజీ సభ్యుడు హఫీజ్ నౌషద్ అహ్మద్ అజ్మీ పిటిషన్ వేశారు. కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఆ సందర్భంగానే కమిటీలను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయని విషయాన్ని న్యాయవాది ప్రస్తావించారు.