మూసీ ఆక్రమణలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-04T07:43:49+05:30 IST

మూసీనది, దానికి అనుబంధంగా ఉన్న కాల్వల ఆక్రమణలపై వివరణ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి కలెక్టర్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ తదితరులకు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

మూసీ ఆక్రమణలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మూసీనది, దానికి అనుబంధంగా ఉన్న కాల్వల ఆక్రమణలపై వివరణ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి కలెక్టర్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ తదితరులకు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మూసీ ఆక్రమణలకు సంబంధించి జూలైలో నోటీసులు జారీచేసినప్పటికీ కౌంటర్లు దాఖలు చేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మూసీ నది ఆక్రమణల వల్ల వర్షాకాలంలో భారీ వరదలు సంభవిస్తూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, ఆక్రమణలు తొలిగించి మూసీ నదిని పునరుద్ధరించాలని కోరు తూ పి.ఇంద్రప్రకాశ్‌ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యా జ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ ఇంద్రప్రకాశ్‌ వాదనలు వినిపిస్తూ.. మూసీనది దశాబ్దాలుగా కబ్జాలకు గురవుతూ కుచించుకుపోతోందని తెలిపారు.  ఈ అంశంలో కౌంటర్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది.  వచ్చే వాయిదానాటికి కౌంటర్లు దాఖలు చేయకపోతే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణ  వచ్చే జనవరి 21కి వాయిదా పడింది. 

Updated Date - 2021-12-04T07:43:49+05:30 IST