మతాంతర వివాహం ఇష్టంలేక తల్లిదండ్రులే అబ్బాయిని చంపించారు

ABN , First Publish Date - 2021-10-08T23:52:40+05:30 IST

తమ కుమార్తె వేరే మతస్తుడిని ప్రేమించడమే కాకుండా అతడితో పెళ్లికి పట్టుబడుతుండడంతో జీర్ణించుకోలేని యువతి

మతాంతర వివాహం ఇష్టంలేక తల్లిదండ్రులే అబ్బాయిని చంపించారు

బెంగళూరు: తమ కుమార్తె వేరే మతస్తుడిని ప్రేమించడమే కాకుండా అతడితో పెళ్లికి పట్టుబడుతుండడంతో జీర్ణించుకోలేని యువతి తల్లిదండ్రులు యువకుడిని దారుణంగా చంపించారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిందీ ఘటన. నగరంలోని ఆజం నగర్ ‌కు చెందిన 24 ఏళ్ల అర్బాజ్ ఖాన్ సివిల్ ఇంజినీరింగ్ చదివి కార్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 27న అదృశ్యమయ్యాడు. ఆ తర్వాతి రోజున ఖానాపుర సమీపంలోని రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. అర్బాజ్ హిందూ యువతిని ప్రేమించడంతో అమ్మాయి తల్లిదండ్రులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. 


పోలీసుల కథనం ప్రకారం.. పుండలీక మహరాజ్ రమ్మని కబురు చేస్తే సెప్టెంబరు 26న అర్బాజ్, అతడి తల్లి ఖానాపుర వెళ్లారు. హిందూ యువతితో సంబంధం పెట్టుకున్నందుకు అక్కడ వారిద్దరినీ బెదిరించారు. ఇద్దరి మతాలు వేరని, కాబట్టి అమ్మాయిని వదిలేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక, అర్బాజ్ ఫోన్‌లో ఉన్న అమ్మాయి ఫొటోలను బలవంతంగా డిలీట్ చేయించారు. తర్వాత సిమ్ కార్డు తీసుకుని పనికిరాకుండా చేశారు.


అర్బాజ్‌ను అంతమొందించాలని యువతి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించిన తర్వాత అతడి హత్యకు పుండలీక పథక రచన చేశాడు. వెంటనే రావాలంటూ అర్బాజ్‌కు పిలిచాడు. అతడు రాగానే పుండలీక, అతడి అనుచరులు అతడి వద్దనున్న డబ్బు, ఇతర వస్తువులను లాక్కున్నారు. అనంతరం హత్య చేసి రైల్వే ట్రాక్‌పైకి విసిరేశారు. అర్బాజ్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా 10మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో  యువతి తల్లిదండ్రులు ఎర్రప్ప బసవన్ని కుంబారా (54), సుశీల ఎర్రప్ప (42) కూడా ఉన్నారు. 


మిగతా నిందితుల్లో  పుండలీక మహారాజ్ (39), కుతబుద్దీన్ అల్లాబక్ష్ (36), మారుతి ప్రహ్లాద్ (30), మంజునాథ్ తుకారామ్ (25), గణపతి జ్ఞానేశ్వర (27), ప్రశాంత్ కల్లప్ప (28), ప్రవీణ్ శంకర్ (28), శ్రీధర్ మహాదేవ దోని ఉన్నట్టు పోలీసులు తెలిపారు.   

Updated Date - 2021-10-08T23:52:40+05:30 IST