పెళ్లికి నిరాకరించిందని ఆమెను ఇరుకున పెట్టేందుకు ఆ యువకుడు ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-10-01T16:12:59+05:30 IST

ముంబైకి సమీపంలోని డోంబివలీలో ఒక యువతి...

పెళ్లికి నిరాకరించిందని ఆమెను ఇరుకున పెట్టేందుకు ఆ యువకుడు ఏం చేశాడంటే...

ముంబైకి సమీపంలోని డోంబివలీలో ఒక యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆమె ప్రేమికుడు ఆ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడు తనకు తానే కిడ్నాప్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తన ఇంటిలోని వారికి సందేశం పంపించాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీపీ, ఎస్పీ, సీనియర్ పీఐ, పోలీసుల బృందం ఆ యువకుని కోసం రాత్రంతా గాలించింది. 


ఎట్టకేలకు రాత్రి 10 గంటల సమయంలో ఆ యువకుడిని పోలీసులు పట్టుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు దత్తానగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ యువకుడు పోలీసులతో మాట్లాడుతూ తాను ఒక యువతిని ప్రేమించానని, అయితే ఆమెతో వివాహానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారన్నాడు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువకునికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఆ యువతి స్నేహితులు కూడా అతనికి నచ్చజెప్పారు. అయితే ఆ యువకుడు వారి మాటలు వినేందుకు ఇష్టపడలేదు. ఆ యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహించిన ఆ యువకుడు ఆ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను, ఆమె స్నేహితులను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించాడు. ఈ నేపధ్యంలోనే తాను కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడాడు. రాత్రి 9 గంటల సమయంలో అతని తండ్రి మొబైల్ ఫోనుకు ఒక మెసేజ్ వచ్చింది. ‘మేము మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. పోలీసులకు ఈ విషయం చెబితే ఇంటికి మీ కొడుకు శవాన్ని పంపిస్తాం’ అని దానిలో ఉంది. దీనిని చూసి హడలెత్తిపోయిన అతని తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసుల బృందం కిడ్నాపర్ల కోసం వేట మొదలు పెట్టింది. 10 గంటల పాటు వెదుకులాట సాగిన అనంతరం మొబైల్ లొకేషన్ సాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడే ఈ కిడ్నాప్ డ్రామా ఆడాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-01T16:12:59+05:30 IST