ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయాననే బాధతో విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-03T03:37:37+05:30 IST
కేరళలోని మళపురంలో ఓ తొమ్మదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు.
తిరువనంతపురం : కేరళలోని మళపురంలో ఓ తొమ్మదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయాననే మనస్తాపంతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మళపురం పోలీసు సూపరింటెండెంట్ అబ్దుల్ కరీం మాట్లాడుతూ, వాలంచేరి టౌన్లో, ఇరింబిలియంకు చెందిన దేవిక (14) సోమవారం ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయారని తెలిపారు. తరగతులకు హాజరుకాకపోతే, చదువు సక్రమంగా సాగబోదని ఆమె తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
దేవిక తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె ఆన్లైన్ క్లాసుకు హాజరుకాలేకపోయినట్లు తెలిపారు. తమ ఇంట్లోని టెలివిజన్ పాడైపోయిందని, స్మార్ట్ఫోన్ కూడా లేదని తెలిపారు.
దేవిక బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.