రూ. 30 వేల బాకీ వసూలు చేసేందుకు మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేసిన 18 ఏళ్ల అమ్మాయి

ABN , First Publish Date - 2022-08-26T03:13:48+05:30 IST

ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చిన రూ. 30 వేలు ఇచ్చిందా అమ్మాయి. ఆ తర్వాత

రూ. 30 వేల బాకీ వసూలు చేసేందుకు మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేసిన 18 ఏళ్ల అమ్మాయి

కోల్‌కతా: ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చిన రూ. 30 వేలు ఇచ్చిందా అమ్మాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో గతంలో తానిచ్చిన రూ. 30 వేలను వసూలు చేసుకోవాలని భావించిన అమ్మాయి.. ఏకంగా కిడ్నాప్‌నకు పాల్పడింది. కోల్‌కతాలో జరిగిందీ ఘటన.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22)-కెస్తోపూర్‌కు చెందిన అమ్మాయి (18) గతంలో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పొరపొచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. వారిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సమయంలో బాయ్‌ఫ్రెండ్‌కు అమ్మాయి రూ. 30 వేలు ఇచ్చింది. అయితే, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు ఆమె గుర్తించింది. తనను పట్టించుకోవడం మానేశాడని అనుమానించింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు.


ప్రస్తుతం మరో యువకుడిని ప్రేమిస్తున్న ఆ అమ్మాయి మాజీ ప్రియుడి నుంచి ఆ రూ. 30 వేలను ఎలాగైనా వసూలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ చక్కని ప్లాన్ వేసింది. కలుసుకుందాం రమ్మని కబురు చేసింది. కబురు అందగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే వెంటనే ఆమె ముందు వాలిపోయాడు. అప్పటికే తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితులతో కాచుక్కూర్చున్న ఆమె అతడిని కిడ్నాప్ చేసి భవానీపూర్‌ తీసుకెళ్లి అక్కడి లేడీస్ పార్క్ సమీపంలో ఓ గదిలో బంధించింది.


అనంతరం మాజీ ప్రియుడి తండ్రి తపన్ (52)కు ఫోన్ చేసి డబ్బులు తెచ్చిస్తేనే వదిలి పెడతానని తేల్చిచెప్పింది. నిజానికి తొలుత రూ. లక్ష డిమాండ్ చేసిన యువతి ఆ తర్వాత తన రూ. 30 వేలు తనకు ఇస్తే చాలంది. దీంతో ఎటూ పాలుపోని తపన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువతితోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్, అతడి ముగ్గురి స్నేహితులను అదుపులోకి తీసుకుని తమల్‌ను రక్షించారు. 

Updated Date - 2022-08-26T03:13:48+05:30 IST