పెళ్లి రద్దు చేసుకుని మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్న యువకుడు.. దీంతో ఆ యువకుడిని కిడ్నాప్ చేసి..
ABN , First Publish Date - 2022-02-07T21:08:40+05:30 IST
ఆ యువకుడికి నాలుగు నెలల క్రితం ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది.. కొన్ని రోజుల తర్వాత ఆ ఎంగేజ్మెంట్ను ఆ యువకుడు రద్దు చేసుకున్నాడు..
ఆ యువకుడికి నాలుగు నెలల క్రితం ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది.. కొన్ని రోజుల తర్వాత ఆ ఎంగేజ్మెంట్ను ఆ యువకుడు రద్దు చేసుకున్నాడు.. అదే గ్రామానికి చెందిన మరో యువతితో ఎంగేజ్మెంట్కు సిద్ధమయ్యాడు.. దీంతో మొదటి యువతి తరఫు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎంగేజ్మెంట్కు ముందే ఆ యువకుడిని కిడ్నాప్ చేశారు.. తమకు జరిగిన నష్టానికి రూ.11 లక్షలు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కథ సుఖాంతమైంది..
రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన రామ్ నివాస్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం బిష్ణోనియన్ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మొదటి యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కారులో వెళుతున్న రామ్ నివాస్ను కిడ్నాప్ చేశారు. రామ్ నివాస్ కారును రోడ్డు పక్కనే ఆపేశారు. తమకు జరిగిన నష్టానికి రూ.11 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
రోడ్డు పక్కన ఉన్న కారు గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ కారు నెంబర్ ఆధారంగా రామ్ నివాస్ అడ్రస్ వెతికి పట్టుకున్న పోలీసులు కిడ్నాప్ జరిగినట్టు తెలుసుకున్నారు. వెంటనే అన్వేషణ ప్రారంభించారు. చివరకు కిడ్నాపర్ల చెర నుంచి రామ్ నివాస్ను రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.