అల్లం ధర పతనం
ABN , First Publish Date - 2022-07-28T05:03:20+05:30 IST
సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు సాగుచేస్తున్న ఆర్గానిక్ అల్లం ధర పతనమైంది. కరోనా కాలంలో కిలో అల్లం ధర రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. దీంతో మద్దతు ధర లేక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కరోనా కాలంలో కిలో రూ.120
ప్రస్తుతం రూ.20
లబోదిబోమంటున్న గిరిజన రైతులు
సీతంపేట: సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు సాగుచేస్తున్న ఆర్గానిక్ అల్లం ధర పతనమైంది. కరోనా కాలంలో కిలో అల్లం ధర రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. దీంతో మద్దతు ధర లేక గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో అల్లం సాగువుతున్నట్టు ఉద్యానవనాల అధికారులు అంచనా వేశారు. దీనికి పట్టణం ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే మైదాన ప్రాంతంలో సాగు చేస్తున్న అల్లం మార్కెట్లోకి దిగుబడి అవుతుండడంతో ఆర్గానిక్ అల్లం కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో గిరిజన రైతులకు కనీసం కూలి డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో సాగు చేస్తున్న అల్లంలో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల వ్యాపారులు మొగ్గుచూపుతున్నప్పటికీ మైదాన ప్రాంతాల్లో చెల్లుబాటు కావడం లేదు. దీంతో ధర ఒక్కసారి పతనమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖాధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా అల్లం ధర పతనమైన మాట వాస్తవమేనని తెలిపారు. గతంలో కంటే పోడు వ్యవసాయంలో అల్లం సాగు గణనీయంగా తగ్గిందని చెప్పారు.