సీఎం సభ సైడ్లైట్స్
ABN , First Publish Date - 2020-11-29T06:52:05+05:30 IST
సీఎం సభ సైడ్లైట్స్
ఎల్బీస్టేడియం ప్రవేశ ద్వారాల వద్ద భారీ ఎల్ఈడీ, డీజే బాక్సులను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని స్పష్టంగా వినిపించే విధంగా ఏర్పాట్లు చేశారు.
శనివారం సాయంత్రం 4.30 గంటలకే ఎల్బీస్టేడియం కార్యకర్తలతో నిండిపోయింది.
బేగంబజార్ టీఆర్ఎస్ నాయకుడు నందకిషోర్ వ్యాస్ బిలాల్ అధ్వర్యంలో దాదాపు 10వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
బషీర్బాగ్ చౌరస్తాను గులాబీ జెండాలతో అందంగా ముస్తాబు చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్ల ముందు కార్యకర్తలు, మహిళలు సెల్ఫీలు దిగడం కనిపించింది.
150 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు ఆర్టీసీ బస్సులు, కార్లు, డీసీఎంలలో తరలి వచ్చారు.
స్టేడియానికి ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ మైదానం వాహనాలతో నిండిపోయింది.
సభాస్థలికి కేసీఆర్ రాకతో జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.
సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్పొరేటర్ అభ్యర్థులు ఎం.ఆనంద్కుమార్గౌడ్, పరమేశ్వరీసింగ్, పూజా వ్యాస్, మమత గుప్తా తెలంగాణ సాంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ సభకు చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలతో కలిసి బస్సులో స్టేడియానికి చేరుకున్నారు.
సాయంత్రం 5.06 గంటలకు మంత్రి కేటీఆర్ సభ వేదికకు చేరుకున్నారు. అంతకు ముందే మంత్రులు, తలసాని, ఈటల, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ వేదిక పైకి వచ్చారు. సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పర్యవేక్షించారు.
కేసీఆర్ సాయంత్రం 5.31 గంటలకు సభ వేదిక మీదకు వచ్చారు.
టీఆర్ఎస్ గుర్తు, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు గల 15 భారీ బెలూన్లను స్టేడియంలో ఏర్పాటు చేశారు.
కళాకారులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
సభలో కేవలం ఇద్దరు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యునికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు.
కేటీఆర్కు ప్రసంగించే అవకాశం రాకపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందారు.
కేసీఆర్ సాయంత్రం 5.37 గంటలకు ప్రసంగం ప్రారంభించి 6.30 గంటలకు ముగించారు. దాదాపు 57 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. హిందీ, ఇంగ్లిష్లో కూడా కేసీఆర్ మాట్లాడారు.
మంత్రి తలసాని ప్రసంగంతో సభ ప్రారంభమైంది. ఎమ్మెల్యే బాల్క సుమన్ సభాధ్యక్షత వహించారు.
సభకు వచ్చిన వారికి కేసీఆర్ బొమ్మలున్న మాస్కులను పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లు శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.
- అఫ్జల్గంజ్/బర్కత్పురా/మంగళ్హాట్, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి)