జీజీహెచ్‌ ఫిజియోథెరఫిస్టులది తలోదారి

ABN , First Publish Date - 2022-07-26T05:46:51+05:30 IST

ఆధునిక చికిత్స పద్ధతుల్లో ఫిజియెథెరపికి ప్రాముఖ్యత పెరుగుతోంది. వైద్యులు చికిత్స అందించిన తరువాత బాధితుడు వేగంగా కోలుకోవడానికి ఫిజియోథెరఫి సేవలు కీలకంగా మారాయి.

జీజీహెచ్‌ ఫిజియోథెరఫిస్టులది తలోదారి
తాళం దర్శనమిస్తున్న విభాగం


ఒకరు రారు, మరొకరు ఎక్కడుంటారో తెలియదు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

గుంటూరు(జీజీహెచ్‌), జూలై 25: ఆధునిక చికిత్స పద్ధతుల్లో ఫిజియెథెరపికి ప్రాముఖ్యత పెరుగుతోంది. వైద్యులు చికిత్స అందించిన తరువాత బాధితుడు వేగంగా కోలుకోవడానికి ఫిజియోథెరఫి సేవలు కీలకంగా మారాయి. దీనిని గుర్తించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫిజియోథెరపి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఒక ఇన్‌చార్జ్‌ ఫిజియోథెరపిస్ట్‌, ఇద్దరు ఫిజియోథెరపిస్ట్‌లు ఉన్నారు. వీరు ప్రతిరోజూ వారి వద్దకు  వచ్చే బాధితులకు సలహాలు ఇవ్వడం, వారితో ఎక్స్‌ర్‌సైజులు చేయించాలి. వివిధ విభాగాల్లో వైద్యులు సూచించిన వారికి వారి వద్దకు వెళ్ళి సూచనలు ఇవ్వాలి.  వీరి వద్దకు నేరుగా ప్రతిరోజు 20 మంది వరకు ఓపీ ఉంటుంది. ఇవి కాక ఆర్థో, న్యూరాలజి, కార్డియాల జి విభాగాల్లో సుమారు 200 మంది రోగులకు ప్రతి రోజూ చికిత్స, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి కీలకమైన విభాగంలో  ఫిజియోథెరఫిస్టులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. వీరిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. సూపరింటెండెంట్‌ స్థాయిలో అనేకసార్లు మెమోలు కూడా ఇచ్చారు. కానీ ఫలితం శూన్యం. ఉన్న ఇద్దరు  ఫిజియోథెరఫిస్టులలో ఒకరు కేవలం హాజరుకే పరిమితం. మరొకరు ఆసుపత్రిలోనే ఉంటారు కానీ ఏ విభాగంలో ఉంటారో వారికే తెలియదు. దీంతో  ఫిజియోథెరఫి సేవలు అవసరమైనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

విద్యార్థుల పరిస్థితి అయోమయం

ప్రభుత్వ ఆసుపత్రిలో  ఫిజియోథెరఫి నేర్చుకునేందుకు కొన్ని కళా శాలలు తమ విద్యార్థులను వీరి వద్దకు పంపుతున్నాయి. వారికి ఏం చేయాలో చెప్పేవారుండరు. ఎలా చేయాలో చెప్పేవారుండరు. అసలు  ఫిజియోథెరఫిస్టులు ఎక్కడున్నారో వెతకడానికి విద్యార్థులకు పుణ్యకాలం పూర్తవుతోంది. కనీసం తమ అటెండెన్స్‌ తమకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇచ్చేందుకైనా వారు కనపడతారేమోనని తిరు గుతున్నారు. దీంతో విద్యార్థులు ఇక్కడకు ఎందుకు వచ్చామా అని తలపట్టుకుంటున్నారు. వీరివి కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే. ఇటీవల వీరి ఉద్యోగాలు పదవీకాలం పూర్తయ్యాయి. అయితే ఏవేవో సర్టిఫికెట్లు పుట్టించి మళ్ళీ కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ విభాగంపై జీజీహెచ్‌ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధితులకు సేవలు అందేలా చూడాలని కోరుకుంటున్నారు. 


Updated Date - 2022-07-26T05:46:51+05:30 IST