పరిషత్ పోరుకు సిద్ధంకండి
ABN , First Publish Date - 2021-02-25T04:42:24+05:30 IST
త్వరలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున అధికారులు సిద్ధం కావాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి అన్నారు.
పూర్తయ్యేవరకూ సెలవులుండవు: జడ్పీ సీఈవో
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 24: త్వరలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున అధికారులు సిద్ధం కావాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ ఏకగ్రీవాలు పోను 35 జడ్పీటీసీ, 424 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవ్వరికీ సెలవులు ఉండవని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ సెల్ఫోన్లో నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ఎస్ఈసీ నుంచి వచ్చే ఉత్తరాలకు ప్రత్యుత్తరాలివ్వడం, నివేదికలు తెప్పించడం, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్ రెండోదశ నేపథ్యంలో అధికారులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శానిటైజర్లను వినియోగంతో పాటు విధిగా మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరంపాటించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.