తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ

ABN , First Publish Date - 2022-01-21T07:01:01+05:30 IST

ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం తిరుచానూరులోని పద్మావతీదేవిని ప్రార్థిస్తూ శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు జరగనున్న శ్రీయాగానికి అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి వేడుకగా అంకురార్పణ జరిగింది.

తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ
పుట్టమన్ను సేకరిస్తున్న అర్చకులు - అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, తదితరులు

అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహణ


తిరుచానూరు, జనవరి 20: ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం తిరుచానూరులోని పద్మావతీదేవిని ప్రార్థిస్తూ శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు జరగనున్న శ్రీయాగానికి  అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి వేడుకగా అంకురార్పణ జరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో అర్చకుడు వేంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏకాంతంగా యాగ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆచార్య రుత్విక్‌వరణం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం 50ఏళ్ల తర్వాత శ్రీయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా యాగం వీక్షించే ఏర్పాటు చేశామన్నారు. జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, అర్చకుడు బాబుస్వామి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీవరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసింది. 21,27వ తేదీల్లో బ్రేక్‌ దర్శనాలు సైతం రద్దయ్యాయి. 


నేటినుంచి కార్యక్రమాలిలా..

శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాగశాలలో హోమాలు, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. 22నుంచి 26వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు ఉంటాయి. 27న ఉదయం 6.30 నుంచి ఎనిమిది గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహా ప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం జరుగుతుంది. 8.30 నుంచి తొమ్మిది గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, అవభృతం నిర్వహిస్తారు. 

Updated Date - 2022-01-21T07:01:01+05:30 IST