జర్మన్ కంపెనీలు రావాలి
ABN , First Publish Date - 2021-12-07T08:08:37+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అవలంబిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
- రాష్ట్రంలో పరిశ్రమలకు సిద్ధంగా 2లక్షల ఎకరాలు
- జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్
- రూ.1,500 కోట్ల జర్మనీ కంపెనీ పెట్టుబడులు
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అవలంబిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపారాల విస్తరణకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని, జర్మన్ కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులతో రావాలని కోరారు. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలను కొత్త పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామని తెలిపారు. సోమవారం నగరంలో జరిగిన జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలన్న లక్ష్యంగా సింగపూర్, అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించి అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని తెలిపారు. టీఎ్స-ఐపా్సలో భాగంగా 15 రోజుల్లోపే పారిశ్రామిక అనుమతులు అందిస్తున్నామని చెప్పారు. ఉత్పాదక రంగానికి కావాల్సిన నాణ్యమైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయని, నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు.
తెలంగాణలో లైట్ఆటో ప్లాంట్
ఆటోమొబైల్ రంగం కోసం ప్రత్యేకమైన మెగ్నీషి యం ఉత్పత్తులను తయా రు చేస్తున్న జర్మనీకి చెందిన లైట్ఆటో జీఎంబీహెచ్.. రూ.1,500 కోట్లతో తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయనన్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్, భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నెర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, లైట్ఆటో మేనేజింగ్ డైరెక్టర్ జె. బాలానంద్ సోమవారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 9,000 మందికి, పరోక్షంగా 18,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు.