సాధారణ స్థితికి..
ABN , First Publish Date - 2022-05-28T06:57:41+05:30 IST
అమలాపురంలో జరిగిన అల్లర్ల అనంతర పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని పోలీసు బలగాలను ఉపసంహరించారు.
- అదుపులో పరిస్థితులు.. కొన్ని బలగాలు ఉపసంహరణ
- కేసుల విచారణపై పోలీసు ఉన్నతాధికారుల కీలక సమీక్ష
- అరెస్టు అయిన 19 మంది నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్8 వీడియో క్లిప్పింగులు, సీసీ ఫుటేజీలతో పోలీసుల విశ్లేషణ
- సోషల్ మీడియా పోస్టింగుల ఆధారంగా కొందరిపై కేసులు
- నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం : డీఐజీ పాల్రాజు
- నెట్ కష్టాలు.. పునరుద్ధరణ కోసం అన్నివర్గాల ప్రజల డిమాండు
అమలాపురం, మే 27 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో జరిగిన అల్లర్ల అనంతర పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని పోలీసు బలగాలను ఉపసంహరించారు. ఘటనా నంతర పరిస్థితులపై లాఅండ్ఆర్డర్ అడిషనల్ ఐజీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడిక్కడ పోలీసు అధికారులతో కీలక సమీక్ష జరిగింది. అటు అల్లర్ల కేసులో అరెస్టు అయిన పంతొమ్మిది మంది నిందితులను ముమ్మిడివరం ఫస్ట్క్లాస్ మెజిస్ర్టేట్, జూనియర్ సివిల్జడ్జి శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం నిందితులను హాజరుపరిచారు. వారికి పధ్నాలుగు రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నిందితులను కాకినాడ సబ్జైలుకు పోలీసులు బందోబస్తు మధ్య తరలించారు. అమలాపురంలో బస్సుల దహనం, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ల ఇళ్ల దహనాలు వంటి పరిస్థితులపై లాఅండ్ఆర్డర్ అడిషనల్ ఐజీ రవిశంకర్ అయ్యన్నర్, డీఐజీ పాల్రాజుల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. ఎస్పీలు సుబ్బారెడ్డి, విశాల్గున్ని, ఎం రవీంద్రబాబు, సిద్ధార్థకౌశల్, పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు సమీక్షలో పాల్గొన్నారు. ఘటనా వైఫల్యం, ఆ సమయంలో విఽధులు నిర్వహించిన పోలీసు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి సమీక్షించారు. కాగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లో కొందరు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా పట్టణంలో ఉన్న పరిస్థితులను అడిషనల్ డీజీ, డీఐజీలతోపాటు పలువురు ఎస్పీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఐదు జిల్లాల నుంచి రప్పించి మోహరించిన కొన్ని బలగాలను ప్రస్తుత పరి స్థితుల నేపథ్యంలో వెనక్కు పంపించేశారు. నిందితుల వేటలో ఉన్న పోలీసులు వైసీపీకి చెందిన పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక పట్టణంలోని ప్రధా న కూడళ్లలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనుమానితులను, యువకులను తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్, అంబాజీపేట, ముమ్మిడివరం ప్రాంతాలకు చెందిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆరోజున వాట్సాప్ గ్రూపుల్లో మెస్సేజ్లు పెట్టిన వ్యక్తులు, ఆ గ్రూప్ల అడ్మిన్లు, ఫార్వార్డ్ చేసిన వ్యక్తులపైనే ప్రధానంగా దృష్టిపెట్టి వారిపై కేసులు నమోదు చేస్తున్న కొందరి పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. మీడియాలో వచ్చిన క్లిపింగులు, వివిధ ఫోన్ల నుంచి సేకరించి వీడియోలతోపాటు అమలాపురం పట్టణ పరిసరాల్లో 250 సీసీ ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నారు. వీడి యోల్లో నిందితుల ముఖ చిత్రాల క్లారిటీ కోసం ప్రత్యేక టెక్నాలజీ సాయంతో స్పష్టంగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు డీఐజీ పాల్రాజు చెప్పారు.
ఇంటర్నెట్ సేవల కోసం డిమాండు
ఇంటర్నెట్ సేవలు ఇంకా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందు లు వర్ణనాతీతం. అమలాపురం పట్టణంలో వివిధ రంగాలకు చెందిన కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగులు నెట్ సేవల కోసం నానా పాట్లు పడుతున్నారు. వర్క్ఫ్రంహోంలో ఉన్న కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. కోనసీమ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ వస్తుండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువకులు ఆయా ప్రాం తాలకు చేరుకుని నెట్ను వీక్షిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆలయాల వద్ద ఉన్న వైఫై సేవలను కూడా వినియోగించుకోవడానికి ఆ ప్రాంతాలకు తరలివెళుతున్నారు. నిందితుల అరెస్టులు జ రిగే వరకు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించేది లేదని డీఐజీ పాల్రాజు వెల్లడించారు.