వర్షాలతో నిలిచిన ‘వంశధార’ పనులు
ABN , First Publish Date - 2021-05-06T04:53:54+05:30 IST
మండలంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార పనులు నిలిచిపోయాయి.
భామిని: మండలంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే 87 ప్యాకేజీలో నత్తనడకన జరుగుతున్న పనులు అధికా రులు వేగవంతం చేయాలని కృషి చేస్తున్న విషయం విదితమే. జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యానికి వర్షాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి. 87 ప్యాకేజీలో 13 కిలోమీటర్లు లైనింగ్ పనులకుగాను దిమ్మిడి జోల, భామిని, పసుకుడి, బిల్లుమడ వద్ద పనులను నిలిచి పోయాయి. నీరు వరదకాలువలో నిల్వ ఉండడంతో మరో 15 రోజుల వరకు పనులు చేయడానికి అవకాశంలేదని కాంట్రాక్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. రెండు మూడు రోజులు ఎండలు బాగా పెడితే మట్టి పనులకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే జూలైలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యానికి అవాంతరాలు కనిపిస్తున్నాయి.