కూలిన ఆర్మీ హెలికాప్టర్లో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి
ABN , First Publish Date - 2021-12-08T19:34:40+05:30 IST
తమిళనాడులోని కూనూరులో సాంకేతిక లోపం వల్ల కూలిన
చెన్నై : తమిళనాడులోని కూనూరులో సాంకేతిక లోపం వల్ల కూలిన సైనిక హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి ఉన్నారని భారత వాయు సేన తెలిపింది. ఇంజిన్ వైఫల్యం వల్ల కోయంబత్తూరు-సూలూరు మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. దీనిలో కొందరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలిపింది.
ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. జనరల్ రావత్ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఈ హెలికాప్టర్లో ప్రయాణించారు. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్లో, ఐఏఎఫ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైందని పేర్కొంది. దీనిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలిపింది.
ఇదిలావుండగా, విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ హెలికాప్టర్లో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.