హింస వద్దు ప్లీజ్.. రైతులకు సీఎం గెహ్లాట్ విజ్ఞప్తి..

ABN , First Publish Date - 2021-01-27T03:22:35+05:30 IST

వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు సంయమనం పాటించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. రైతులు...

హింస వద్దు ప్లీజ్.. రైతులకు సీఎం గెహ్లాట్ విజ్ఞప్తి..

జైపూర్: వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు సంయమనం పాటించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలపవచ్చనీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు దిగొద్దని ఆయన కోరారు. ఢిల్లీలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం గెహ్లాట్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘ఇప్పటి వరకు రైతుల ఉద్యమం శాంతియుతంగా సాగింది. రైతులు శాంతియుతంగానే తమ నిరసన తెలపాలి తప్ప హింసకు దిగొద్దు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసకు దిగడం వల్ల రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించే భద్రతా బలగాలకు అవకాశం దొరకుతుంది..’’ అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. ట్రాక్టర్లతో బారికేడ్లను దాటుకుని ఢిల్లీ నడిబొడ్డున ఎర్రకోట, ఐటీవో వైపు దూసుకెళ్లారు. ముందుగా నిర్ణయించిన మార్గాల్లో కాకుండా వేర్వేరు దారుల్లో రైతులు దూసుకెళ్లడంతో భద్రతా బలగాలు లాఠీచార్జి, భాష్పవాయుగోళాలతో వారిని చెదరొట్టేందుకు ప్రయత్నించారు. రాజ్‌పథ్ మార్గంలో రిపబ్లిక్ వేడుకలు ముగిసిన తర్వాత రైతులు ఎంపిక చేసిన మార్గాల్లో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే అనుమతించిన మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లోకి ప్రవేశించడంతో పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ రేగింది. 

Updated Date - 2021-01-27T03:22:35+05:30 IST