ఎట్టకేలకు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన గౌతమ్ సవాంగ్
ABN , First Publish Date - 2022-02-19T00:50:12+05:30 IST
ఎట్టకేలకు ప్రభుత్వ ఒత్తిడికి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తలొగ్గారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి అంగీకారం తెలిపారు.
అమరావతి: ఎట్టకేలకు ప్రభుత్వ ఒత్తిడికి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తలొగ్గారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి అంగీకారం తెలిపారు. డ్యామేజీ కంట్రోల్ ఎక్సర్సైజ్లో ఏపీ ప్రభుత్వం బీజీగా ఉంది. కాసేపటి క్రితం ఫైల్ను రాజ్భవన్కు పంపారు. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి డీమ్డ్టూబీ రిజైన్డ్ క్లాజ్ను సర్కార్ ఉపయోగించుకుంది. రాత్రికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సవాంగ్కు డీజీపీ పదవి కట్టబెట్టి... చెప్పినవన్నీ చేసినా, ఇంకా ఏవేవో చేయలేదంటూ పక్కన పెట్టేసింది. సర్వీసు ఉండగానే ఆయనను బదిలీ చేసేసింది. దీనిపై సామాన్య ప్రజల నుంచి అధికార వర్గాల వరకు వ్యతిరేకత రావడంతో ‘నష్ట నివారణ’ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గౌతమ్ సవాంగ్కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీపీఎస్సీకి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు సెక్రటరీగా పనిచేస్తున్నారు. సవాంగ్, పీఎస్సార్ మధ్య పొసగదన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యమే. మొన్నటిదాకా ఏపీపీఎస్సీ చైర్మన్గా పని చేసిన ఉదయ భాస్కర్ను ఎన్ని తిప్పలు పెట్టారో, ఎంత దారుణంగా అవమానించి పంపించారో అందరికీ తెలుసు. సవాంగ్కూ అలాంటి అనుభవాలు ఎదురుకావనే గ్యారెంటీ లేదు. డీజీపీ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించేశారు. 17 నెలలు సర్వీసు ఉండగానే వీఆర్ఎస్ తీసుకోవాలి. యూనిఫాం వదులుకుని... ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టు చేపట్టాలి. అలా చేస్తే ఆయన ప్రభుత్వానికి సరెండర్ అయ్యారన్న సంకేతాలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో 17 నెలలు ఎలాగోలా కాలంగడిపి, రిటైర్ అయిపోదామన్న భావనలో సవాంగ్ ఉన్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు